కరీం ఐఏఎస్ కావాలనుకోవడం వెనుక!: అప్పట్లోనే ఛాన్స్ వచ్చినా, వేటు పడొచ్చు..
హైదరాబాద్: యూపీఎస్సి సివిల్స్లో హైటెక్ మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడ్డ ఐపీఎస్ సఫీర్ కరీం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియవచ్చాయి. సురేష్ గోపీ పోలీస్ సినిమాలంటే పడి చచ్చే కరీంపై.. 'కమిషనర్' సినిమా బాగానే ప్రభావం చూపించింది.
కరీం 'పెద్ద జాదూ': ఇలా హైటెక్ కాపీయింగ్.., సురేష్ గోపీ స్ఫూర్తి, విస్తుపోవాల్సిందే!
ఐపీఎస్ ఇంటర్వ్యూకు ముందు సైతం కమిషనర్ సినిమా చూసి వెళ్లానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కరీం. ఇక తాజాగా తెలిసిందేంటంటే.. నిజానికి 2015లో కరీం జాతీయ స్థాయిలో సాధించిన 112ర్యాంకుతో ఐఏఎస్ కు ఎంపికయ్యే అవకాశమున్నా.. కేవలం పోలీస్ పాత్రలపై ఉన్న మక్కువతోనే అతను ఐపీఎస్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
కాపీయింగ్కూ సినిమాలే స్ఫూర్తి
ఐపీఎస్గా కొనసాగుతున్న కరీం.. ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఐపీఎస్గా కొనసాగడానికి తన ఫిట్నెస్ సరిపోదని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో వదిలేసుకున్న ఐఏఎస్ కోసం మళ్లీ ప్రయత్నించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే హైటెక్ కాపీయింగ్ కు పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు.
ఇలా కాపీయింగ్ కు పాల్పడటానికి కూడా హిందీలో వచ్చిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', తమిళంలో వచ్చిన 'వసూల్ రాజా' సినిమాలే కరీంపై ప్రభావం చూపించాయని పోలీసుల విచారణలో తేలడం గమనార్హం.
చెన్నైకి జోయ్సీ, రాంబాబు
మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చెన్నై డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని పోలీస్ టీమ్ 'లా ఎక్స్లెన్సీ అకాడమీ' ఐఏఎస్ కోచింగ్ సెంటర్తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఇంట్లో సోదాలు నిర్వహించింది.
సాయంత్రానికి కరీం భార్య జోయ్సీ జోయ్ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విమానంలో చెన్నైకి తరలించారు. రాంబాబును సైతం తమ వెంట తీసుకువెళ్లారు. అయితే విచారణలో రాబట్టే వివరాల ఆధారంగా అతని అరెస్టుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
వివాహమిలా:
కరీం భార్య జోయ్సీ జోయ్ తాను స్థాపించిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఎకనమిక్ ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. ఇనిస్టిట్యూట్ లో ఏర్పడిన పరిచయమే వీరిద్దరి వివాహానికి దారితీసింది. ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడటం ఐపీఎస్ గా కొనసాగడంపై కరీంను ఆలోచనలో పడేసింది. ఫిట్ నెస్ లేని కారణంగా ఐఏఎస్ అవడమే బెటర్ అని నిర్ణయించుకున్నట్టు అతని స్నేహితులు పోలీసులతో చెప్పినట్టు సమాచారం.
భార్యను హైదరాబాద్ పంపించి
మున్నాభాయ్ ఎంబీబీఎస్, వసూల్ రాజా సినిమాల్లో చూపించిన మాదిరిగానే కాపీయింగ్ కు ప్లాన్ చేసుకున్నాడు. హైదరాబాద్లోని లా ఎక్స్లెన్సీ ఐఏఎస్ ట్రైనింగ్ అకాడెమీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న భార్య జోయ్సీని అక్కడికి పంపించాడు. మైక్రో కెమెరా, వైర్ లెస్ హియర్ ఫోన్స్, సాక్సులో సెల్ ఫోన్ తో పరీక్ష హాల్లోకి ఎంటర్ అయ్యాడు. 20నిమిషాల తర్వాత ఇంటలిజెన్స్ బ్యూరో పరీక్ష హాల్లోకి వచ్చి కరీంను చెక్ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు.
వేటు పడవచ్చు
హైటెక్ మాస్ కాపీయింగ్ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంను సర్వీసు నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అతను సరైన వివరణ ఇవ్వకుంటే వేటు తప్పదని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు హెచ్చరించారు.
పరీక్ష సమయం లో ఆయన ప్రవర్తన గురించి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అలాంటి వ్యక్తికి ఐపీఎస్ లాంటి సర్వీసులో ఉండే అర్హత లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగా నే కరీంపై చర్యలు ఉంటాయని, అయితే తన వాదనలు వినిపించేందుకు ఆయనకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చింది.
2014లో మిస్సయ్యాడు
2014లో అశోక్నగర్లో లా ఎక్స్లెన్సీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రాంబాబుతో కలిసి తిరువనంతపురంలో కరీమ్స్ 'లా ఎక్స్లెన్సీ' పేరుతో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో తాను కోచింగ్ తీసుకుంటూనే మరికొందరు అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాడు.
ఆ ఏడాది తాను కోచింగ్ తీసుకున్న విద్యార్థులతో కలిసే సివిల్స్ రాసిన కరీం.. తన విద్యార్థులైన 20మందితో కలిసి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అయితే ఇంటర్వ్యూలో 6మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయాడు. 2015లో మరోసారి సివిల్స్ రాసిన కరీంకు జాతీయ స్థాయిలో 112వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుకు ఐఏఎస్ అయ్యే అవకాశమున్నా.. కమిషనర్ సినిమా ప్రభావంతో ఐపీఎస్ అయేందుకే మొగ్గుచూపాడు.