నిన్న అలా నేడు ఇలా: ఇక దూరమేనా.. జగన్ తర్వాత చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన, వైసీపీ పార్టీలు పోటీ చేయడం లేదు. విభజన సమయంలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు రెండు రాష్ట్రాల్లో ఉంటాయని భావించారు. 2014లో వైసీపీ పోటీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ఎమ్మెల్యే, ఖమ్మం లోకసభ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత వారు తెరాసలో చేరారు. జనసేన అధినేత పవన్ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి అండగా నిలిచారు. కానీ పవన్ ఈసారి ఏపీలో బరిలోకి దిగుతున్నారు.
వెలుగులోకి కొత్త విషయం.. సీబీఐకి ఈడీ లేఖ: ఎన్నికలకు ముందు జగన్కు 'హైదరాబాద్' షాక్
నిన్న జగన్.. నేడు పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారు
పరిణామాలు చూస్తుంటే వైసీపీ, జనసేనలు ఇక ఏపీకే పరిమితమైనట్లుగా కనిపిస్తున్నాయి. తెలంగాణకు సంబంధం లేని పార్టీలుగా ముద్రపడుతున్నాయి. నిన్న వైసీపీ, నేడు జనసేనలు తెలంగాణలో పోటీ విషయంలో చేతులెత్తేశాయని అంటున్నారు. అధికారికంగా ఆయా పార్టీల నుంచి ఎలాంటి మాట లేకపోయినప్పటికీ.. అనధికారికంగా ఆ పార్టీల చర్యలు అలాగే కనిపిస్తున్నాయి. వైసీపీ పోటీ చేయాలనుకుంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేసేది. ఇప్పుడు లోకసభ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. కేసీఆర్తో దోస్తీ కారణంగా వైసీపీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఎలాంటి కదలిక లేదు
ఇటీవల పలు సందర్భాల్లో జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీపై స్పందించింది. గత ఏడాది డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... తెలంగాణలో అనుకోకుండా ముందస్తు ఎన్నికలు వచ్చాయని, కాబట్టి పోటీ చేయడం లేదని తెలిపారు. దీంతో లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోను తెలంగాణలో పోటీపై ఎలాంటి కదలిక కనిపించడం లేదు. జగన్, పవన్ కళ్యాణ్లు ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల అభ్యర్థుల పైనే కసరత్తు చేస్తూ, అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
ఒక్కొక్కరు చేతులెత్తేస్తున్నారు
తెలంగాణపై పోటీ విషయంలో ఒక్కొక్కరు వరుసగా చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. జగన్, పవన్ కళ్యాణ్ తర్వాత తెలుగుదేశం పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదని అంటున్నారు. తెలంగాణలో టీడీపీ క్రమంగా బలహీనపడుతోంది. లోకసభ ఎన్నికల్లో పోటీ అంశాన్ని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలకే వదిలేశారు. ఈ నేపథ్యంలో పోటీ విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరమే. పార్టీలోని నేతలు అంతా అధికార తెరాస, కాంగ్రెస్ వైపు వెళ్లినందున తెలంగాణ టీడీపీలో కీలక నేతలు తగ్గారు.