మరోసారి, తెరపైకి 'హైదరాబాద్ దేశ రెండో రాజధాని': ఎందుకంటే..
హైదరాబాద్: హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ టిడిపి సీనియర్ నేత మరోసారి ఆ విషయమై మాట్లాడారు.
టిడిపి నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం నాడు మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు చట్ట సభలలో సముచిత స్థానం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్రంయ అని అన్నారు. తెలంగాణ కల సాకారం అయినప్పటికీ వెనుకబడిన వర్గాలకు సరైన గుర్తింపు లేదన్నారు.
హైదరాబాదును దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరానికి రెండో రాజధాని హోదాను ఇస్తే అసమానతలు దూరం అవుతాయని వ్యాఖ్యానించారు. సత్వర అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని మోత్కుపల్లి అన్నారు.
టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ... మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన అసమర్థ పాలన వల్ల లోటు బడ్జెట్లోకి తీసుకు వెళ్లారన్నారు. అవినీతిలో కూరుకుపోయిన మంత్రుల పైన సిఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
మంత్రివర్గంలో మహిళలు, వెనుకబడిన వర్గాలకు అవకాశం లేదన్నారు. తెలంగాణలో వివక్ష రూపుమాపాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిందే అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి స్వర్గీయ నందమూరి తారక రామారావు పాటుపడ్డారన్నారు.