సీఎం కేసీఆర్ మదిలో కొత్త ఊసు: మళ్లీ కర్షక పరిషత్కు పురుడు
అన్నదాతల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన.
హైదరాబాద్: అన్నదాతల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన. ఆ దిశగా వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి రూ.4000 ఆర్థిక సాయం అందజేయడానికి ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితికి చట్టబద్ధమైన ప్రత్యామ్నాయంపై ఆయన ప్రధానంగా ద్రుష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగానే మరోసారి కర్షక్ పరిషత్ ఆలోచన మళ్లీ పురుడు పోసుకున్నదని తెలుస్తున్నది.
శుక్రవారం పాడి పరిశ్రమాభివ్రుద్ధిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ 'కర్షక్ పరిషత్' ఏర్పాటు సంగతి బయట పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన కర్షక పరిషత్ గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. సీఎంతో సమానంగా కర్షక పరిషత్కు అధికారాలు కల్పిస్తూ ఆనాటి సీఎం ఎన్టీరామారావు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రతిపాదనలను కొట్టేసిన హైకోర్టు
నాడు ఎన్టీఆర్ ఎన్నిసార్లు చంద్రబాబును కర్షక్ పరిషత్ సమన్వయకర్తగా నియమించినా హైకోర్టు కొట్టేసింది. అయినా కర్షక్ పరిషత్ సమన్వయకర్త పదవి అప్పట్లో చంద్రబాబుకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దానిని తెలంగాణలో అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సీఎం కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కర్షక పరిషత్ను తీసుకురాలేమా అని సీనియర్ నేతలు, అధికారులతో సమీక్షించారు.
ప్రత్యామ్నాయాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మాదిరిగానే రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి, దానికి పూర్తిస్థాయిలో అధికారాలను కల్పిస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే దీనిపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇదే విషయమై శుక్రవారం గుత్తా సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు అంశం ఇంకా తుదిరూపు తీసుకోలేదన్నారు.
చట్టపరంగా ఇబ్బందుల్లేకుండా ముందుకెళ్లాలని..
సీఎం కేసీఆర్ మూడు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నారని వాటిలో ఏదో ఒక ప్రతిపాదనకు తుది రూపునిచ్చే అవకాశం ఉన్నదని గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాకు చెప్పారు. అందులో ఒకటి గతంలో ఉన్న కర్షక పరిషత్ను మళ్లీ ఏర్పాటు చేసే ప్రతిపాదన అని చెప్పారు. అలాగే రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏరకమైన పరిణామాలుంటాయన్న దానిపైనా చర్చిస్తున్నారని చెప్పారు. మూడో ప్రతిపాదనగా రైతు సమన్వయ సమితి సొసైటీ కింద నియమిస్తే ఎలా ఉంటుందన్నదానిపైనా చర్చిస్తున్నారని, త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు.
ఇంటెలిజెన్స్ తో ఇలా సీఎం కేసీఆర్ ఆరా
ఇదిలా ఉంటే 31 జిల్లాలకు కేవలం 11 జిల్లాల్లోనే రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. మిగతా జిల్లాల్లో సగం సమితుల ఏర్పాటు కూడా పూర్తి కాలేదు. ఇక పూర్తయిన జిల్లాల్లో ప్రక్రియపై సందేహాలతో ఇంటలిజెన్స్ విభాగంతో సీఎం కేసీఆర్ సర్వే నిర్వహిస్తున్నారని సమాచారం. ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమ్రంభీమ్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోని సమితులు పూర్తయ్యాయి. వీటి నివేదికలను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వానికి పంపిన వివరాల్లో రైతు పేరు, తండ్రి పేరు, ఏ కేటరిగి అనే వివరాలు మాత్రమే అందించారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందక ఇంటిలిజెన్స్ విభాగంతో పున:పరిశీలన చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మంత్రులు, ఎమ్మెల్యే సిఫారసులతోనే సరి
మిగతా 20 జిల్లాల్లో ఇంకా ఈ సమితుల ఏర్పాటు నత్తనడకన కొనసాగుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 45 శాతం కూడా పూర్తి కాకపోవడంతో రైతులు ఆసక్తి కనబర్చడం లేదని ఏవోలు చెబుతున్నారు. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల జోక్యం ఎక్కువగా ఉండడంతో సమితుల నియామకం ఆశించిన రీతిలో ముందుకుసాగడం లేదని తెలుస్తోంది. చాలాచోట్ల వివాదాలు వచ్చి ఆగిపోయామని సమాచారం. సమితుల సభ్యులను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన రైతుల జాబితాను మంత్రివద్దకు మోసుకొస్తున్నారు. కాగితాల మీద పేర్లను పరిశీలించి, కావాల్సిన వాళ్ల పేర్లను మంత్రి ఖరారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన ఆదర్శ రైతుల వ్యవస్థకు, రైతు సమన్వయ సమితులకు తేడా ఏమీ లేదని రైతులు విమర్శిస్తున్నారు.