క్యాబినెట్ విస్తరణలో మరోసారి మహిళలకు షాక్ ఇచ్చిన కేసీఆర్ .. ఎస్టీలకూ దక్కని స్థానం
Recommended Video
టిఆర్ఎస్ పార్టీలోని ఆశావహుల, తెలంగాణ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని క్యాబినెట్ విస్తరణ నేడు జరగనుంది. ఇప్పటికే పదిమందికి మంత్రి శాఖలను కేటాయిస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. నేడు వారంతా రాజ్ భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో ఎస్టీలకు, మహిళలకు స్థానం లేనట్లుగా తెలుస్తుంది. అలాగే ఈసారి మంత్రులుగా ఆరుగురు కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు గులాబీ బాస్.
నేడే మంత్రివర్గ విస్తరణ .... మంత్రులు వీరే
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూహూర్తం రానే వచ్చింది.తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జరగనుంది.పాత కొత్తల కలయిక గా క్యాబినెట్ విస్తరణ చేయనున్నాడు గులాబీబాస్. ఉదయం 11.30లకు తెలంగాణ క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిమంది మంత్రులతో రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. మంత్రివర్గంలో అవకాశం పొందినవారు.. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్రెడ్డిలు
ఆరుగురు కొత్తవారికి అవకాశం... నలుగురు పాతవారు
కొత్త మంత్రివర్గంలో ఆరు కొత్త ముఖాలకు చోటు కల్పించారు సీఎం కేసీఆర్. ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. గత కేబినెట్ నుంచి నలుగురు పాతవారికే కొత్త జాబితాలో స్థానం దక్కింది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ లు ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, తాజా మంత్రులతో కలిపి తెలంగాణ క్యాబినెట్ సంఖ్య 12 కు చేరింది.
ఫోన్ చేసి ఆహ్వానించిన కేసీఆర్ ...కృతజ్ఞతలు తెలిపిన సదరు ఎమ్మెల్యేలు
ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని వీరిని సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో ఆహ్వా నించారు. 'మీరు ప్రభుత్వంలో ఉంటున్నారు. బంగారు తెలంగాణ సాధనకు కలిసి పనిచేద్దాం'అని సీఎం చెప్పారు. సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు సైతం మంత్రులుగా ప్రమాణం చేసే వారికి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఫోన్లో సీఎం మాట్లాడిన వెంటనే వీరంతా ప్రగతిభవన్కు చేరుకుని కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మరోసారి మహిళలకు మొండి చెయ్యి .. ఈ సారి ఎస్టీలకు స్థానం లేనట్టే
ఇదిలావుంటే మంత్రివర్గ విస్తరణ తొలిజాబితాలో ఒక్క మహిళకు కూడా స్థానం దక్కలేదు. గత క్యాబినెట్ లోనే మహిళలు లేరు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు కేసీఆర్ . అయినప్పటికీ ఈక్యాబినెట్ లోనూ మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. టీఆర్ఎస్ తరుఫున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్)లలో ఒకరికి తాజా విస్తరణలో మంత్రిగా చాన్స్ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ మహిళలకు కేసీఆర్ మంత్రి వర్గంలో మరోసారి స్థానం లేదని తాజా జాబితాను బట్టి తేలిపోయింది . దీంతో టీఆర్ఎస్ పార్టీలోనిమహిళా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఈ దఫా విస్తరణలో ఎస్టీలకు కూడా స్థానం లేనట్లుగా కనిపిస్తోంది. ఎస్టి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి కూడా కేసీఆర్ క్యాబినెట్ లో లేరు. తాజా జాబితాలో సైతం ఎస్టీ కి స్థానం ఇవ్వలేదు. గతంలో చందూలాల్ కు కేటాయించినా , ఈసారి ఇప్పుడు జరుగుతున్న విస్తరణలో గిరిజన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే మంతి వర్గ విస్తరణలో అయినా వీరికి అవకాశం లభిస్తుందో లేదో తెలియదు.మొత్తానికి కేసీఆర్ మంత్రులుగా అవకాశమిచ్చిన వారి జాబితాలో మహిళలకు, ఎస్టీలకు మొండి చెయ్యి ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్ .