సీఏఏ వందకు వంద శాతం తప్పు.. అవసరమైతే హైదరాబాద్లో 10లక్షల మందితో సభ : సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) రాజ్యాంగ విరుద్దమని, దాన్ని వందకు వంద శాతం తాము వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాథమిక హక్కులు అనేవి మతాలకు,కులాలకు అతీతంగా అందరికీ అందాలని చెప్పారు. సీఏఏ చట్టంలో ముస్లింలను పక్కనపెడుతామని చెప్పడం సరికాదన్నారు. కశ్మీర్ విషయంలో దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 రద్దుకు మద్దతునిచ్చామని, కానీ సీఏఏ చట్టం విషయంలో మాత్రం విభేదిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి చెప్పినా మద్దతునిచ్చేందుకు ఒప్పుకోలేదన్నారు. అంతేకాదు,సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలని సూచించారు. తమ పార్టీ ఎంపీలు కూడా రాజ్యసభ,లోక్సభలో తమ వైఖరిని స్పష్టం చేశారని చెప్పారు.
సీఏఏ వ్యతిరేక తీర్మానం చేస్తాం..
సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు,చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసి హైదరాబాద్లో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇంకా అవసరమైతే 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ కూడా పెడుతామన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మొండి పట్టుకు పోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు ప్రజా నిర్ణయాలను గౌరవించాలన్నారు.
సీఏఏ విషయంలో కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతామని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేస్తామని తెలిపారు.
సీఏఏని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి..
భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తున్నారని అంతర్జాతీయ కథనాలు కూడా వస్తున్నాయని.. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని కేసీఆర్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తీవ్రంగా నష్టపోతుందన్నారు. భారత్ నుంచి బయటి దేశాలకు వెళ్లే పిల్లలను అగౌరవపరిచే,అనుమానించే పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం గల్ఫ్లో దాదాపు 25లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, రేప్పొద్దున వారందరి పరిస్థితి ఏం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. కాబట్టి సీఏఏ అనేది వందకు వంద శాతం తప్పుడు బిల్లు అని.. ప్రధాని మోదీ దీన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక వర్గాన్ని పక్కనపెడుతామని చెప్పడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
ఇవాళ ముస్లిం.. రేపు ఇంకొకరు..
ఎన్ఆర్సీ,ఎన్పీఆర్ విషయంలో కేంద్రమంత్రులే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. ఎన్ఆర్సీ,ఎన్పీఆర్లకు సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని,కానీ సీఏఏ చట్టంలో మాత్రం ఎన్పీఆర్ ఎన్ఆర్సీ ప్రక్రియ మొదటి అడుగు అని పేర్కొన్నట్టుగా చెప్పారు. ఇక మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్పీఆర్ అమలు విషయంలో రాష్ట్రాలకు స్వేచ్చ ఉందని చెబుతున్నారనని తెలిపారు. ఏదేమైనా సీఏఏ విషయంలో ప్రజల్లో అభద్రత నెలకొందని.. ఇప్పుడు ముస్లింలను పక్కనపెట్టినవారు భవిష్యత్తులో తమను కూడా పక్కనపెడుతారని మిగతా వర్గాల వారు కూడా ఆందోళన చెందుతున్నారని అన్నారు.
Recommended Video
నేను భయంకరమైన హిందువును..
దేశంలో నిరుద్యోగం,రైతు సమస్యలు,ఆర్థిక మందగమనం వంటి విషయాలను వదిలేసి మతాల మధ్య చిచ్చు పెట్టే పద్దతి సరికాదన్నారు. మతం విషయానికొస్తే.. తనకంటే పెద్ద హిందువు ఎవరని.. తాను చేసినట్టుగా యాగాలు,యజ్ఞాలు ఎవరు చేశారని, తాను భయంకరమైన హిందువునని స్పష్టం చేశారు. మత వివాదాలు,గొడవలు దేశానికి మంచివి కావని, అవన్నీ చిల్లర వ్యవహారాలని కొట్టిపారేశారు. భైంసాలోనూ ఈ భక్తుల కారణంగానే గొడవలు జరిగాయని, ఉక్కుపాదంతో వాటిని అణచివేసి, అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగేలా చూశామని చెప్పారు. పనికిరాని గొడవలతో దేశానికి ఒరిగేదేమి ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీఏఏ లాంటి చట్టాలను పక్కనపెట్టి దేశ అభివృద్దిపై దృష్టి పెట్టాలని సూచించారు. శాస్త్రీయ దృక్పథంతో,అభ్యుదయ భావాలతో ప్రపంచం ముందుకెళ్తున్న వేళ.. మతతత్వ సంకుచిత భావాలు సరికాదని అభిప్రాయపడ్డారు.