కాంగ్రెస్ పార్టీ నేతలకు గులాబీ వల..! చిక్కుతారా..! చిక్కరా..!!
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గ్యారంటీ అని చెప్పుకునే గులాబీ బాస్ కు లోలోల మాత్రం ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. 2019లో ఖచ్చితంగా గెలుస్తామని గంభీరంగా చెబుతున్న కేసీఆర్ కాంగ్రెస్ కదలికల పట్ల ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ప్రజల్లోకి వస్తుందోనని, ఎక్కడ తమ విజయానికి గండికొడుతుందోనని మదనపడుతున్నారట కేసీఆర్. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలకు గాలం వేసి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసారట గులాబీ బాస్.. తాజాగా ఏ కాంగ్రెస్ నాయకుడికి గులాబీ పార్టీ వల వేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
గులాబీ దళంలో గెలుస్తామన్న ధీమా..! మరో పక్క బెంగ..!
ముందస్తు ఎన్నికల ఆలోచన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు.మరో సారి అధికారం చేజిక్కుంచుకోవాలన్న ఆలోచనతో ఆయన పావులు కదుపుతున్నారు.ఒక వైపు ప్రభుత్వ పరంగా అభివ్రుద్ది,సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న కేసీఆర్ పార్టీ కార్యకలాపాలపైన కూడా ద్రుష్టి సారించారు.ప్రధానంగా పార్టీలో నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో పటిష్ట కేడర్ తో ఓట్ల వేయించగల్గిన నాయకులు టీఆర్ఎస్ కు మరింత మంది అవసరమన్న అంచనాలో ఆయన ఉన్నారు.ఇందు కోసం ప్రత్యర్థి పార్టీల్లో బలమైన నేతలపైన కేసీఆర్ గాలం వేస్తున్నారు.
ఆపరేషన్ మంత్రం ఆకర్శ్ మంత్రాన్ని సక్సెస్ చేసిన గులాబీ బాస్..! శత్రు శేషం పై గురి..!
నిజానికి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన నాటి నుంచి ప్రతిపక్షాలకు చెెందిన అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలు చాలా సులభంగా టీఆర్ఎస్ వలలో చిక్కారు. దీంతో పార్టీలకు పార్టీలనే చంద్రశేఖర్ రావు విజయవంతంగా మాయం చేశారు. అసెంబ్లీ నుంచి బీఎస్పీ,సిపిఐ, వైసీపీ పార్టీలను గల్లంతు చేసిన ఆయన బలమైన తెలుగుదేశం పార్టీ ఉనికిని దారుణంగా దెబ్బతీశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను కూడా తన ఫిరాయింపు ఆఫరేషన్ తో ఆడుకున్నారు. దాదాపు మూడేళ్ల పాటు యద్ధేచ్ఛగా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగించారు. గత సంవత్సర కాలంగా ఫిరాయింపులకు కొంత వరకు తెరపడింది. అయితే ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్న చంద్రశేఖర్ రావు మళ్ళీ తన గులాబీ కండువా ఆపరేషన్ ను మొదలు పెట్టారు.
వచ్చే ఎన్నికల్లో "చెయ్యి"ని దించండి..! ఇదే కేసీఆర్ ఆన..!!
ప్రధానంగా కాంగ్రెస్ లో మిగిలిన కొంత మంది సీనియర్ నేతలను తన వైపు తిప్పుకోవడానికి మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు.ఇందులో భాగంగా టీఆర్ఎస్ నేతలు మీడియాకు లీక్ లు వదులుతున్నారు.నల్గొండ జిల్లాలో తమకు కొరకరాని కొయ్యలా తయారైన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేసీఆర్ గాలం వేశారు.కోమటిరెడ్డి సోదరులిద్దరిని పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనను పార్టీ నేతలతో పంచుకున్నారు.దీంతో ఆ విషయం మీడియాకు లీకైంది. దీంతో వెంకట్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది.అయితే తాను కాంగ్రెస్ లోనే ఉంటానని సోదరులిద్దరు బల్లగుద్ది చెపుతున్నప్పటికి అనుమానపు మేఘాలు మాత్రం కమ్ముకునే ఉన్నాయి. మరో వైపు జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపైన కూడా టీఆర్ఎస్ ఇలాంటి వ్యూహాన్నే అమలు చేస్తోంది.
కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి జీవిస్తాడా..? నటిస్తాడా..??
కాంగ్రెెస్ సీనియర్ నేతల్లో ఒకరైన జీవన్ రెడ్డి సీఎల్పీ ఉపనేత గా వ్యవహారిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ లోపల, బయట కూడా ఆయన అధికార పార్టీని టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి జీవన్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. జగిత్యాలలో తమ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో చంద్రశేఖర్ రావు ఈ ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. గతంలో కూడా జీవన్ రెడ్డికి గాలం వేసినప్పటికి ఆయన టీఆర్ఎస్ కు చిక్కలేదు. అప్పుడు ఆశలు వదులుకున్న కేసీఆర్ ఇప్పుడు మరో సారి గేమ్ స్టార్ చేశారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే ఈ సారి కూడా జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. మొత్తానికి తెలంగాణలోని ప్రతిపక్షాలకు మళ్ళీ మూడిందన్న మాట. ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడానికి శక్తియుక్తులు కూడదీసుకోవడంతో పాటు పార్టీలో నాయకులను కాపాడుకోవాల్సి ఉంటుంది.ఇది నిజంగా విపక్షాలకు అగ్నిపరీక్షలాంటిదే..!