సీఎంలకు 'అజ్ఞాతవాసి' షాక్: డిఫెన్స్లో పడ్డారా? పవన్ కళ్యాణ్ రాయబారం, ట్విస్ట్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి లభించలేదు. అర్ధరాత్రి తర్వాత ప్రదర్శనలు వద్దని చెబుతూ థియేటర్ యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ షోలకు భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని, అందుకే అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఉదయం ఏడు గంటలకు మాత్రం ఒక షోకు అనుమతించారు. మూడు షోలు ఎక్కువగా కోరితే, మంగళవారం ఉదయం నో చెప్పి, సాయంత్రానికి ఒక ఎక్స్ట్రా షోకు అనుమతించారు.
అజ్ఞాతవాసి ప్రత్యేక షోలకు నో!
అజ్ఞాతవాసి ప్రీమియర్ షోల కోసం భ్రమరాంభ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లు పోలీసుల అనుమతిని కోరాయి. అయితే భద్రతా కారణాలు చూపిస్తూ అనుమతి నిరాకరించారు. గతంలో కూడా ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాటలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, అభిమానులు సహకరించాలని కోరారు. దీంతో మూడు షోలకు అనుమతివ్వలేదు.
ఏపీలో మూడు, తెలంగాణలో ఒకటి
మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్ షోలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమాకు ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు ఏడు షోల చొప్పున ప్రదర్శనకు అనుమతించింది. ఏపీలో అర్ధరాత్రి 1 గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కూడా షోల ఉంటాయి. తెలంగాణలో మాత్రం ఉదయం ఏడు గంటలకు ఒక అదనపు షోకు అనుమతి లభించింది.
ఇరువరు డిఫెన్సులో, కానీ వేర్వేరుగా
ఏపీలో అనుమతించడం, తెలంగాణలో అనుమతి నిరాకరించడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఓ విధంగా ఇరువురు సీఎంలో డిఫెన్సులో పడ్డారని, అందుకే ఇలా నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తోందనే ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో ఏపీలో చంద్రబాబు ప్రదర్శనలకు అనుమతిచ్చారని అంటున్నారు.
అజ్ఞాతవాసి కోసం ఫలించని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు?
అదే సమయంలో, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మరో విధమైన డిఫెన్సులో పడిందని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన గౌరవపూర్వకంగానే కలిశారని చెప్పినప్పటికీ అజ్ఞాతవాసి సినిమా గురించే కలిశారనే ప్రచారం సాగింది. అయితే, పవన్ ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు.
అందుకే కేసీఆర్ డిఫెన్సులో పడ్డారు
పవన్ ప్రయత్నాలు ఫలించకపోవడానికి కేసీఆర్ డిఫెన్సులో పడటమే కారణమని అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉందనే విమర్శలను విపక్షాలు చేస్తున్నాయి. ఎందుకోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో.. అందుకోసం ఈ ప్రభుత్వం పని చేయడం లేదని స్వయంగా జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా ఆరోపించారు.
రేవంత్ రెడ్డి, కోదండరాం సహా విమర్శలు
తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు కట్టబెడుతోందంటూ కాంగ్రెస్, జేఏసీ, ఇతర పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ను పవన్ కలిసిన సమయంలోను రేవంత్ రెడ్డి, కోదండరాం సహా పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. నిన్నటి శత్రువులు నేడు మిత్రులు అయ్యారని విమర్శించారు. ఇప్పటికే ఆంధ్రాపక్షపాతి అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో మరో తలనొప్పి తెచ్చుకోవద్దనే ప్రీమియర్ షోలకు అనుమతివ్వలేదనే ప్రచారం సాగుతోంది. అయితే, ఏపీలో మూడు, తెలంగాణలో ఒక అదనపు షోకు అనుమతి లభించడంతో పవన్ కళ్యాణ్ రాయబారం, ఆయన పలుకుబడి ఉపయోగపడిందని అంటున్నారు.