పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల అత్యుత్సాహంపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల అత్యుత్సాహంపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి.
భాగ్యనగరాన్ని వీలైనంత త్వరలో 'బెగ్గర్ ఫ్రీ సిటీ'గా మార్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నవ్వులపాలవుతోంది. ఏ వ్యక్తి అయినా కాస్త చిరిగిన దుస్తులు, మాసిన గెడ్డంతో కనిపిస్తే చాలు.. హైదరాబాద్ పోలీసులు 'డౌట్ లేదు.. బిచ్చగాడే..' అనుకుంటున్నారు.
‘బెగ్గర్ ఫ్రీ సిటీ'గా మార్చాలని...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు అయినా ఇవాంకా ట్రంప్ గ్లోబల్ సమిట్లో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్య అధినేత ట్రంప్ కూతురు మన హైదరాబాద్ లోని బిచ్చగాళ్లను చూస్తే.. మన పరువే పోతుందని అనుకున్నారో ఏమోగానీ వారిని మాయం చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఒక ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలో బిచ్చగాళ్లపై ఆంక్షలు విధించి, స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
పోలీసుల అత్యుత్సాహం...
హైదరాబాద్ను బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ.. చంచల్గూడ జైల్లో ఆనందాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. నగరంలోని ఆయా కూడళ్ల వద్ద ఉండే బిచ్చగాళ్లను తీసుకువచ్చి అందులో చేర్పించాలని పోలీస్ శాఖకు లేఖలు రాసింది. దీంతో నగరంలోని ఆయా ఠాణాల పోలీసులు బిచ్చగాళ్ల గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ఎవరు యాచకులు, ఎవరు కాదనే విషయంలో సరైన నిర్ధారణకు రాకుండానే కనిపించిన వాళ్లను కనిపించినట్లు ఎత్తుకెళ్లిపోతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
అలా ఉంటే బిచ్చగాళ్లేనా?
నే యాచకులను నిర్ధారించుకునే విషయంలోనే తప్పులో కాలేస్తున్నారు. ‘చిరిగిన దుస్తులు ధరించి.. మాసిన గెడ్డంతో కనిపిస్తే బిచ్చగాళ్లుగా ముద్ర వేస్తారా? కొత్త దుస్తులు, దుప్పట్లు ఇస్తామని మభ్యపెట్టి వాహనంలో ఎక్కించుకుని చంచల్గూడ జైలుకు తీసుకువస్తారా?' అని ఆనందాశ్రమంలోని ‘బిచ్చగాళ్లు' ప్రశ్నిస్తున్నారు. బిచ్చగాళ్లం కాదని చెప్పినా పోలీసులు వినిపించుకోవడంలేదంటూ వారు వాపోతున్నారు.
కాస్త మాసిన గెడ్డం ఉంటే యాచకులేనా...?
చిరిగిన దుస్తులు ధరించి, గెడ్డం పెంచుకుని రోడ్ల మీద తిరిగే వారిలో చాలామందిని చంచల్గూడ జైలులోని ఆనందాశ్రమానికి తరలిస్తున్నారు పోలీసులు. ఫలితంగా పోలీసుల అత్యుత్సాహానికి ఎంతోమంది బాధితులుగా మారారు. ‘నేను బిచ్చగాడిని కాదు.. హైదరాబాద్ను చూడటానికి వచ్చానని చెబుతున్నా వినిపించుకోకుండా నన్ను ఆనందాశ్రమానికి తరలించారు..' అని ఓ వ్యక్తి చెబుతుండగా, నాచారంలో రూ.5 భోజనం చేస్తుండగా తనను తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్పించారని మరోవ్యక్తి వాపోతున్నారు.
కొత్త దుస్తులు, దుప్పట్లు ఇస్తామని...
ప్రస్తుతం ఆనందాశ్రమంలో 85 మంది ఉండగా అందులో 70 మంది తాము బిచ్చగాళ్లం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా జైల్లోనే ఉంటున్నామని.. ఒకే ఒక్కరోజు అని చెప్పి తీసుకొచ్చి, ఇప్పుడేమో మూడు నెలలు ఆశ్రమంలోనే ఉండాలంటూ నిర్బంధిస్తున్నారని పలువురు బాధితులు పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. ‘చిరిగిన దుస్తులు ధరించి.. మాసిన గెడ్డంతో కనిపిస్తే బిచ్చగాళ్లుగా ముద్ర వేస్తారా? కొత్త దుస్తులు, దుప్పట్లు ఇస్తామని మభ్యపెట్టి వాహనంలో ఎక్కించుకుని చంచల్గూడ జైలుకు తీసుకువస్తారా?' అంటూ ఆనందాశ్రమంలోని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
నిద్రపోతుంటే తీసుకువచ్చారు...
పటాన్చెరులో స్నేహితుడిని కలవడానికి తాను వారం రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చానని, అదే రోజు రాత్రి రైలు మిస్సవడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పడుకోగా, అర్ధరాత్రి సమయంలో నలుగురు పోలీసులు వచ్చి ప్రశ్నించారని, నిద్ర మత్తులో తాను సరిగా సమాధానాలు ఇవ్వకపోయే సరికి వాహనంలో తీసుకువచ్చి చంచల్గూడ జైలులో వదిలిపెట్టారని, తెల్లవారుజామున నేను ఇంటికి వెళ్లిపోతానని చెప్పినా వదల్లేదని మరో బాధితుడు బావురుమంటున్నాడు.
గుడి ముందు ప్రసాదం తింటుంటే..
మరో బాధితుడు మాట్లాడుతూ.. తాను మలక్పేటలో కార్పెంటర్గా పనిచేస్తున్నానని, కుటుంబ తగదాల వల్ల భార్యకు దూరంగా ఉంటున్నానని, రెండ్రోజుల క్రితం దిల్సుఖ్నగర్ బాబా ఆలయం బయట ప్రసాదం తింటుండగా పోలీసులు వాహనంలో ఎక్కించుకుని ఆనందాశ్రమానికి తీసుకువచ్చారని మరో బాధితుడు వాపోయాడు. తన కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే పంపిస్తామని అధికారులు చెబుతున్నారని, కుటుంబ తగదాల వల్ల తనను తీసుకెళ్లడానికి ఎవరూ రారని, ఇక తన గతి ఇంతేనా? అని అతడు ప్రశ్నిస్తున్నాడు.
ఇవాంకా వస్తుందని కాదు...
అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా వస్తున్నందునే నగరంలోని బిచ్చగాళ్లను తరలిస్తున్నారనే ఆరోపణలు నిజం కాదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వివరణ ఇవ్వగా.. అసలు గ్లోబల్ సమ్మిట్కు.. ఆనందాశ్రమానికి సంబంధం లేదని, సమ్మిట్ తేదీ ప్రకటించకముందే ఆశ్రమం గురించి ప్రభుత్వానికి లేఖ రాశామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ పేర్కొన్నారు.