పెళ్లి కోసం కొన్న పట్టుచీరనే మృతదేహానికి చుట్టి... ఎస్సారెస్పీ దుర్ఘటన నింపిన విషాదం...
జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన శ్రేయ(25)కు మే 23న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టేముందు స్వగ్రామం జోగన్పల్లిలో దైవదర్శనం కోసం ఆ కుటుంబం బయలుదేరింది. కానీ ఊహించని ప్రమాదంతో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
వెంకటేశ్వరస్వామి దర్శనానికి బయలుదేరి...
జగిత్యాలకు చెందిన కటికనేని అమరేందర్రావు (58) స్థానిక కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శిరీష(52), కూతురు శ్రియ(25), కొడుకు జయంత్ ఉ న్నారు. ఏడాది క్రితమే శ్రేయకు పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది మే 23న ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. సంప్రాదాయం ప్రకారం పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు స్వగ్రామంలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నారు. ఇందుకోసం సోమవారం(ఫిబ్రవరి 15) తెల్లవారుజామున 5గంటలకు జగిత్యాలలోని ఇంటి నుంచి బయలుదేరారు.
ఉదయం 6గంటల సమయంలో...
అమరేందర్రావు కారు డ్రైవింగ్ చేస్తుండగా... పక్క సీట్లో కొడుకు, వెనక సీట్లో భార్య, కూతురు కూర్చున్నారు. సుమారు 6గంటల సమయంలో కారు మేడిపల్లి శివారుకు చేరింది. అదే సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. జయంత్కు ఈత రావడంతో చాకచక్యంగా బయటపడి స్థానికులు,పోలీసులకు సమాచారమిచ్చాడు. అయితే అప్పటికే కారు 500మీ. దూరం కొట్టుకుపోయింది. క్రేను సాయంతో కారును బయటకు తీయగా అమరేందర్ రావు,శ్రేయ,శిరీషలు అప్పటికే మృతి చెందారు.
ఆ పట్టుచీరనే శ్రేయ మృతదేహానికి చుట్టి...
అమరేందర్ రావు కుమార్తె శ్రేయ ఢిల్లీలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. పెళ్లికి మరో రెండు నెలలే ఉండటంతో పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేశారు. పెళ్లి కోసం కొనుగోలు చేసిన పట్టుచీరనే శ్రేయ మృతదేహానికి చుట్టి అంత్యక్రియలు నిర్వహించడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అమరేందర్ రావు,ఆయన కుటుంబ సభ్యుల మృతి పట్ల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో సంజయ్ కుమార్ తండ్రి హన్మంతరావు వద్ద అమరేందర్ రావు జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అమరేందర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.