పీసీసీ చీఫ్ గా తప్పుకుంటా: సోనియాకు చెప్పేసిన ఉత్తమ్: కొత్త సారధిగా..ఆ ముగ్గురిలో..!
ఊహించిందే జరిగింది. పీసీపీ చీఫ్ పదవి నుండి తప్పుకుంటున్నట్లుగా ఉత్తమ్ నేరుగా పార్టీ అధినేత్రి సోనియాకు చెప్పారు. దీంతో..కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక మీద కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతల అభిప్రాయలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారు పోటీ పడుతుండగా...పార్టీ హైకమాండ్ మాత్రం ముగ్గురు నేతల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో తొలి పేరు రేవంత్ రెడ్డి కాగా..ఆ తరువాత జానారెడ్డి..దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్లు వరసలో ఉన్నట్లుగా సమాచారం.
ఉత్తమ్ పదవీకాలం ఏడాది కిందటే పూర్తయింది. అయినా.. వరుస ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం ఆయననే కొనసాగించింది. హుజూర్నగర్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఉత్తమ్.. ఆయన సతీమణి పద్మావతి.. ఢిల్లీ వెళ్లి అధినేత్రి సోనియాను కలిశారు. ఈ సందర్భంగా పదవి నుంచి తాను తప్పుకోవాలనుకుంటున్నట్లు ఉత్తమ్ చెప్పినట్లు సమాచారం. దీనికితోడు ఇటీవల సీడబ్ల్యూసీ నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాద్కు వచ్చిన సమయంలోనూ మునిసిపల్ ఎన్నికలకు ముందే టీపీసీసీకి కొత్త సారథిని నియమించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పదవిని తాను ఆశిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆజాద్కు చెప్పారు.
లోక్సభ ఎన్నికల తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్రెడ్డి పేరును అధిష్ఠానం ప్రధానంగా పరిశీలించింది. అయితే పలువురు అభ్యంతరం తెలపడం, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ ఈ ప్రచారం ఊపందుకుంది. బీసీ కోటాలో పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వి.హన్మంతరావు.. రేవంత్రెడ్డి అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాను కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఎస్సీని నియమించాలని భావిస్తే.. తనకు అవకాశం ఉంటుందని సంపత్ భావిస్తున్నారు. బీసీ కోటాలో మధుయాష్కీ సైతం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రేవంత్కు ప్రత్యామ్నాయంగా జానారెడ్డి పేరును కొందరు, వివాద రహితుడిగా పేరున్న శ్రీధర్బాబును మరికొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి.. ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రతికూలంగా మా రే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పీసీసీ చీఫ్ ఎంపిక అధిష్ఠానానికి సవాల్గానే మారింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే కొత్త సారథిని నియమించాలన్న ఆలోచనలో భాగంగా అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎన్డీయే ఆర్థిక విధానాలపై ఏఐసీసీ ఆధ్వర్యంలో 15 వరకు నిరసనలు తలపెట్టడంతో.. 16 నుంచి టీపీసీసీ చీఫ్ ఎంపికను వేగవంతం చేసే అవకాశం ఉందంటున్నారు. అందులో ప్రధానంగా అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ఎంపిక పైనే ప్రధానం ఫోకస్ చేసినట్లు సమాచారం.