వెనకడుగు వేస్తున్నారంటే... టీఆర్ఎస్ ఆ విషయం ఒప్పుకున్నట్లే : పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. నిన్న,మొన్నటిదాకా నీటి వాటాలపై ఇద్దరిదీ ఒకే మాట అన్నట్లుగా సాగిన ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్... ఇప్పుడు ఒకరినొకరు టార్గెట్ చేసే పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణకు సంబంధించి పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ జగన్ తీరును తప్పుపట్టడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ జగన్ పట్ల తన స్టాండ్ను మార్చుకోవడాన్ని తెలంగాణ ప్రతిపక్షాలు వట్టి డ్రామా అని కొట్టిపారేస్తున్నాయి. ఏఐసీసీ కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తాజాగా కేసీఆర్పై ధ్వజమెత్తారు.
రాంగోపాల్ వర్మ సినిమాల్లో నాటకాల్లా...
పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ ఏపీ సీఎం జగన్పై చేసే విమర్శలు రాంగోపాల్ వర్మ సినిమా నాటకాలను తలపిస్తున్నాయని వంశీచంద్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలకు కర్త,కర్మ,క్రియ కేసీఆరేనని... తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లు ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని అన్నారు. జగన్తో సమావేశమైనప్పుడు అసలు కేసీఆర్ ఏం మాట్లాడారో,చర్చించారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఆ విషయం ఒప్పుకున్నట్లే...
పోతిరెడ్డిపాడుతో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తోందన్నారు. ఈ జల దోపిడీని అడ్డుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పోతిరెడ్డిపాడు టెండర్లను రద్దు చేయించలేకపోతే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడుపై నిజానిజాలను చర్చించేందుకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే... టీఆర్ఎస్ నాయకులు ముఖం చాటేస్తున్నారని అన్నారు. బహిరంగ చర్చకు వెనకడుగు వేస్తున్నారంటే తెలంగాణ ప్రయోజనాలను బలి చేస్తున్నామని టీఆర్ఎస్ ఒప్పుకున్నట్లే అన్నారు.
Recommended Video
ఎవరి ప్రయోజనాల కోసం కాలాయాపన...
బహిరంగ చర్చకు రాకపోయినా... కనీసం తాము అడిగే ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ను వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో కోర్టుకు వెళ్లడంలో ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసేంతవరకూ కాలాయాపన చేస్తూ వచ్చారని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు కాలాయాపన చేశారని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టడానికి అసలు కారణమేంటని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.