అంతా భారతీయులే, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం మానుకోవాలి: అసదుద్దీన్ హెచ్చరిక
న్యూఢిల్లీ/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ లోకసభ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎప్పటికీ భారత దేశంలో భాగమని, పాకిస్తాన్ అనవసరంగా కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ దేశాన్ని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు.
రాజకీయాల్లో యువత అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఎంపీలు కవిత, అసదుద్దీన్, అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్, యూకే లేబర్ పార్టీ ఎంపీ సీమా మల్కోత్రీ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు.
కాశ్మీర్ పండిట్ల గురించి అసదుద్దీన్
ఈ సందర్భంగా అసదుద్దీన్ను ఒకరు కాశ్మీర్ అంశం గురించి ప్రస్తావించారు. కాశ్మీర్లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చే స్పష్టమైన విధానం, దృక్కోణం కేంద్రంలో కొలువుదీరుతున్న ప్రభుత్వాలకు లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు అన్ని కూడా కాశ్మీరి పండిట్ల కోసం ఏం చేయలేదన్నారు. శరణార్థుల లెక్కలు సేకరించలేదన్నారు.
పాకిస్తాన్ బురదజల్లవద్దు
కాశ్మీర్, కాశ్మీర్ ప్రజలు ముమ్మాటికి భారత్లో అంతర్భాగమని చెప్పారు. కాశ్మీర్లోని వారంతా భారత ప్రజలే అన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ తన జోక్యం మానుకోవాలని చెప్పారు. బురద జల్లడం మానుకోవాలని హెచ్చరించారు. తాను గాంధీజీని అభిమానిస్తానని, అంతకంటే ఎక్కువగా అంబేడ్కర్ను అభిమానిస్తానని చెప్పారు. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయనే ఆరోపణలపై మాట్లాడుతూ.. నలుగురిని ఆలోచింప చేసేందుకు తాను అలా మాట్లాడుతానని చెప్పారు.
నెటిజన్ల స్పందన
అసదుద్దీన్ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి అలా మాట్లాడుతున్నారని, చివరకు ఆయన మోడీ దారిలోకి వచ్చారని, ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, సూపర్ అని, థ్యాంక్స్ ఓవైసీ, కాంగ్రెస్కు నచ్చ చెప్పు అని, కాశ్మీర్లోని కొందరు రాజకీయ నాయకులకు చెప్పాలని, అసలు ఓవైసీ మాటలు నమ్మవచ్చా అని... ఇలా వివిధ రకాల కామెంట్స్ వచ్చాయి.
ఇదే సమావేశంలో కవిత ఏమన్నారంటే
ఎంపీ కవిత మాట్లాడుతూ... ప్రస్తుతం యువత ఎక్కువగా ఉన్న దేశం ముప్పై ఏళ్ల తరువాత వృద్ధులున్న దేశమవుతుందని, ఇప్పుడు యువత సమస్యలు పరిష్కరించేలా విధానాలు లేకుంటే, తర్వాత వృద్ధుల సమస్యలు పరిష్కరించలేమని, విధానాలు ఎప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించాలని, దేశ జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయని, ఆ ఆదాయాన్ని అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రాలకు పంచుతున్నారని, తొలుత అందరికీ ఆహారం, విద్య, ఉపాధి ప్రధానమని చెప్పారు. ఈ సౌకర్యాలు కల్పించేటప్పుడు రాష్ట్రాల కోణంలో చూడకూడదని తెలిపాు. మొత్తం దేశం అభివృద్ధిగా పరిగణించాలన్నారు. ముందుగా పేదలకు లబ్ధి చేకూర్చిన తర్వాతే రాష్ట్రాల గురించి ఆలోచించాలన్నారు.