జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు...
టీఆర్ఎస్ ఒక బలమైన రాజకీయ పార్టీ అని.. తెలంగాణ ప్రాంతీయతకు అది ప్రతినిధి అని హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పక సమీక్ష చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. బీజేపీతో ప్రజాస్వామిక పద్దతిలో తమ పోరాటం కొనసాగుతుందని... తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఆ పార్టీని విస్తరించకుండా అడ్డుకోగలరన్న నమ్మకం తమకు ఉందని అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తాము 44 స్థానాల్లో గెలుపొందామని అసదుద్దీన్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన అందరు కార్పోరేటర్లతో తాను స్వయంగా మాట్లాడానని... అందరూ రేపటి నుంచే పని చేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ మీడియాతో అసదుద్దీన్ మాట్లాడారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్... ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. ప్రస్తుతం వచ్చిన స్థానాలకు అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించామన్నారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వెల్లడైందని... 10 -15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందామని అన్నారు. బీఎన్ రెడ్డి కాలనీలో 18 ఓట్ల తేడాతో, మౌలాలిలో 200, అడిక్మెట్లో 200, మల్కాజ్గిరిలో 70 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. తాజా ఫలితాలపై సమీక్ష నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్స్కు కూడా ధన్యవాదాలు చెప్పారు.
అనూహ్య ఫలితాలతో ఈసారి గ్రేటర్లో 'హంగ్' నెలకొంది. గ్రేటర్ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. టీఆర్ఎస్ 54,బీజేపీ 47,ఎంఐఎం 42,కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకున్నాయి. మేయర్ పీఠానికి కావాల్సిన సంఖ్యా బలం 102 ఎవరికీ లేకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్కు 38 ఎక్స్అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు సాధించిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం 92 మాత్రమే అవుతుంది. అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందా..? అన్న చర్చ తెర పైకి వచ్చింది.
ఎంఐఎంతో తమకెలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పిన టీఆర్ఎస్... మేయర్ పీఠం కోసం ఆ పార్టీతో జతకడితే బీజేపీ చేతికి మరో అస్త్రం చిక్కినట్లవుతుంది. అటు ఎంఐఎం కూడా టీఆర్ఎస్కు నిస్వార్థంగా మద్దతు ప్రకటిస్తుందా లేక మేయర్ సీటును చెరో రెండేళ్లు పంచుకుందామన్న ప్రతిపాదన తీసుకొస్తుందా అన్నది వేచి చూడాలి.
Recommended Video
TRS in Telangana is a formidable political party. It represents the regional sentiment of Telangana. I am sure K.Chandrashekar Rao will review the party's performance in these elections: AIMIM President Asaduddin Owaisi in Hyderabad pic.twitter.com/EVEkoEVEWf
— ANI (@ANI) December 4, 2020