దారుణం: ఎయిర్ హోస్టెస్పై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారయత్నం
హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన శంషాబాద్లో ప్రముఖ విమానయాన సంస్ధలో ఎయిర్ హోస్టెస్గా పని చేస్తున్న ఓ యువతి అత్యాచారయత్నానికి గురైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే...
మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు రాజేంద్ర నగర్లో తాను నివాసముంటున్న హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ నుంచి మెడిసిన్స్ కోనేందుకు మహిళ బయటకు వచ్చింది. స్థానికంగా ఉన్న మెడికల్ షాపుకు వెళ్లగా దుకాణం మూసిఉంది.
దీంతో మందులు కొనే నిమిత్తం అక్కడికి సమీపంలో ఉన్న ఓ క్యాబ్ను ఆశ్రయించింది. మందుల దుకాణానికే తీసుకువెళ్తానని చెప్పిన క్యాబ్ డ్రైవర్ మార్గాన్ని మార్చి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి కారును తీసుకుపోయాడు.
కారు ముందు సీట్లో మహిళ కూర్చుని ఉంది. దుండగుడి చర్యలను పసిగట్టిన మహిళ అప్రమత్తమై అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను గట్టిగా పట్టుకుని వెనకకు తోసి అత్యాచారంచేయ ప్రయత్నించాడు.
మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగుడు ఆమెను కొట్టి సెల్ఫోన్ను లాక్కెళ్లిపోయాడు. దీంతో నిర్మానుష్య ప్రాంతం నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చి వేరొక టాక్సీ డ్రైవర్ వద్ద ఉన్న ఫోన్ తీసుకుని తనపై జరిగిన అత్యాచారయత్నాన్ని బంధువులకు వివరించింది.
జరిగిన దుర్ఘటనపై మహిళ రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితుడిని ఇమ్రాన్గా గుర్తించారు. దోపిడీ, అత్యాచారం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు నిందితుడి పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
బాధితురాలిని వెంట పెట్టుకుని విమానాశ్రయ పరిసర ప్రాంతాలతో పాటు హిమయత్ సాగర్ లాంటి ప్రాంతాలను పరిశీలించారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని సేకరించి పరిశీలిస్తున్నారు.