ఆగివున్న విమానం నుంచి జారిపడ్డ ఎయిర్హొస్టెస్: తీవ్రగాయాలు
Recommended Video
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్)లో ఆగి ఉన్న ఓ విమానం నుంచి ఎయిర్హోస్టెస్ జారి పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకొంది.
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్ లైన్స్ విమానం గురువారం మధ్యాహ్నం 1.40గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది. అనంతరం విమానం పార్కింగ్ స్థలానికి చేరుకుంది.
ప్రయాణికులు ఎక్కేందుకు విమానాన్ని సిద్ధం చేస్తుండగా అందులో ఉన్న ఓ ఎయిర్హొస్టెస్ ప్రమాదవశాత్తు విమానం ప్రవేశ ద్వారం వద్ద నుంచి జారి పడింది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.