నాపై రివాల్వర్లతో దాడి: కోర్టులో తనపై దాడి చేసిన వారిని గుర్తించిన అక్బరుద్దీన్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తన పైన గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో మంగళవారం నాడు నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై బుధవారం కూడా కోర్టులో విచారణ కొనసాగనుంది.
తన శరీరంలో ఇంకా బుల్లెట్ ఉందని అక్బరుద్దీన్ కోర్టులో చెప్పారు. కత్తులు, రివాల్వర్లతో తన పైన దాడికి పాల్పడ్డారని చెప్పారు. తన వద్ద వెపన్ లాక్ చేయబడి ఉందని చెప్పారు. తన తుపాకీని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. అయితే, పిటిషన్ దాఖలు చేయాలని అక్బరుద్దీన్కు న్యాయస్థానం సూచించింది.
అక్బరుద్దీన్ పదమూడు మంది నిందితులను కోర్టులో గుర్తించారు. తన పైన దాడి జరిగిన తీరును ఆయన కోర్టుకు వివరించారు. అనంతరం కోర్టు కేసును వాయిదా వేసింది. రేపు విచారణ జరగనుంది. కాగా, పాతబస్తీలోని బార్సక్ ప్రాంతంలో అక్బర్ పైన గతంలో హత్యాయత్నం జరిగింది. అక్బర్తో పాటు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. దీంతో, కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.