అక్బరుద్దీన్ కామెంట్స్.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఛార్జ్ షీట్ ఎప్పుడో మరి?
హైదరాబాద్ : ఎంఐఎం లీడర్, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. 2012లో ఓసారి చేసిన వ్యాఖ్యలతో 40 రోజులు జైలుశిక్ష అనుభవించిన అక్బరుద్దీన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అయితే కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి.. అక్బరుద్దీన్ వీడియోలో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖలు లేవని క్లీన్ చిట్ ఇవ్వడం మరింత గందరగోళానికి దారి తీసింది. అయితే హోంమంత్రి మహమూద్ అలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
2012లో కేసు.. 2013లో బెయిల్.. 2014 తర్వాత ఏమైంది?
15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే అంటూ 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఆ క్రమంలో ఆయన 40 రోజులు జైలుశిక్ష కూడా అనుభవించారు. అయితే 2013 ఫిబ్రవరిలో బెయిల్పై వచ్చారు. ఆ లెక్కన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనపై కేసు నమోదైంది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దరిమిలా అక్బరుద్దీన్ కేసు నీరుగారిపోయిందనే ఆరోపణలున్నాయి. ఇంతవరకు ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఆ క్రమంలో ఇటీవల కరీంనగర్ పర్యటనకు వెళ్లిన అక్బరుద్దీన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఇలాంటి వారిని ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వదిలేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ జరుగుతుంటే.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మాత్రం క్లీన్ చీట్ ఇచ్చారు. అది మరింత దుమారం రేపుతోంది. అంత క్లియర్గా వీడియోలో అక్బరుద్దీన్ మాట్లాడిన ఎవిడెన్స్ ఉంటే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఏవీ చేయలేదంటూ సీపీ ధృవీకరించడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.
కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేక మేడల్లా కూలుతున్నాయ్.. చిన్న వర్షానికే..!
ఎంఐఎంతో పొత్తు ఎన్నికల వరకే..!
అదలావుంటే మంగళవారం నాడు ఓ టీవి ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, రాజకీయ విశ్లేషకులు వీరయ్య పాల్గొన్నారు. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై హోంమంత్రి మహమూద్ అలీని ఫోన్ లైన్లో చర్చకు ఆహ్వానించారు. ఆ క్రమంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ టీఆర్ఎస్ నేతలు అధికారులను బెదిరించుకుంటూ ఇలాంటి క్లీన్ చిట్స్ పొందుతున్నారనే ఆరోపణలపై మీరేమంటారు అనే ప్రశ్నకు.. లోకల్ పోలీసులు డిటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేశారు, వారు ఎంక్వైరీ చేశాక చూస్తాం అంటూ సమాధానమిచ్చారు.
2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు ఓపెన్ చేయలేదన్న ప్రశ్నకు పరిశీలిస్తామంటూ ఆన్సర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా ఉన్న కారణంతోనే అక్బరుద్దీన్పై చర్యలు తీసుకోవడం లేదా అనే ప్రశ్నకు పొత్తులనేవి కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగని ప్రతిసారి వారికి సపోర్ట్ చేయలేము కదా అనే రీతిలో మాట్లాడారు.
ఎవరూ అలా మాట్లాడినా తప్పే.. అవసరమైతే అక్బరుద్దీన్పై ఛార్జ్ షీట్..!
2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద కేసుగా పరిగణించారని.. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అతడిపై కేసు ఎందుకు కంటిన్యూ చేయలేదని కృష్ణసాగర్ ప్రశ్నించారు. దానికి మహమూద్ అలీ సమాధానం ఇస్తూ తాను మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఏడు నెలలే కదా అవుతోందని చెప్పారు. మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తే.. తప్పకుండా ఎంక్వైరీ చేయిస్తానని, అవసరమైతే ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే తెలంగాణ పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు కదా.. మరి అక్బరుద్దీన్ విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నకు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పకుండా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చివరగా అక్బరుద్దీన్ అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఖండిస్తారా అని అడిగితే.. ఎవరైనా సరే అలా మాట్లాడటం సరికాదన్నారు. భారతదేశంలో విభిన్న మతాలున్నాయని.. అందరూ కలిసిఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అక్బరుద్దీనే కాదు ఆ విధంగా ఎవరూ మాట్లాడినా తప్పే అని చెప్పుకొచ్చారు హోంమంత్రి మహమూద్ అలీ.