శివరాత్రికి సెలవు అడిగిన అక్బరుద్దీన్: కేసీఆర్ ప్రశంస
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం ప్రశంసలు కురిపించారు. అక్బరుద్దీన్ ఓవైసీ శివరాత్రి పండుగ కోసం అదనపు సెలవు కావాలని కోరారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. శివరాత్రి పర్వదినం నాడు భక్తులు రాత్రంతా జాగారం చేస్తారని, కాబట్టి వారు మరుసటి రోజు పని చేసేందుకు ఇబ్బంది అవుతుందని, కాబట్టి శివరాత్రి నాడు మరో సెలవు ఇవ్వాలని కోరారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉందని, ఆయన తీరు.. హిందూ పండుగల కోసం కూడా అడగడం బాగుందన్నారు. ఇది తెలంగాణ సెక్యులర్కు నిదర్శనమన్నారు.
కాగా, రంజాన్, క్రిస్మస్లతో పాటు శివరాత్రి పండుగకు కూడా సెలవులు ప్రకటించాలని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం ప్రభుత్వాన్ని కోరారు. రంజాన్, క్రిస్మస్ పర్వదినాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిపై అక్బరుద్దీన్ సభలో మాట్లాడారు. శివరాత్రికి కూడా రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాలన్నారు. వక్ఫ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. యాదాద్రి (యాదగిరి గుట్ట)తో పాటుగా మేజర్ చర్చిలను కూడా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.