శివరాత్రికి సెలవు కావాలని అక్బర్, కేసీఆర్ అసహనం
హైదరాబాద్: రంజాన్, క్రిస్మస్లతో పాటు శివరాత్రి పండుగకు కూడా సెలవులు ప్రకటించాలని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం ప్రభుత్వాన్ని కోరారు. రంజాన్, క్రిస్మస్ పర్వదినాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిపై అక్బరుద్దీన్ సభలో మాట్లాడారు. శివరాత్రికి కూడా రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాలన్నారు. వక్ఫ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. యాదాద్రి (యాదగిరి గుట్ట)తో పాటుగా మేజర్ చర్చిలను కూడా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
విపక్షాలపై కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణ శాసనసభలో విపక్షాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్పై అందరూ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని అయితే కొందరు పనిగట్టుకుని విమర్శలు చేశారని మంత్రి ఈటెల రాజేందర్ పరోక్షంగా ప్రతిపక్షాలకు చురకలంటించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
స్పీకర్ వారించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. దీంతో కేసీఆర్ కల్పించుకున్నారు. సభ నడిపే పద్దతి ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ మైక్ ఇవ్వాలనుకుంటేనే మైక్ ఇస్తారని, మీకు నచ్చినప్పుడు మైక్ ఇవ్వరన్నారు. నచ్చితే సభకు సహకరించండి లేదా నిరసన తెలిపి వెళ్లిపొండంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి అభ్యంతరం తెలిపారు. అయితే వెళ్లిపోండి అని తాను అనలేదని కేసీఆర్ వివరణ ఇచ్చుకున్నారు.