అక్కినేని ఫ్యామిలీకి కేంద్రం షాక్!: అక్కినేని ఫౌండేషన్కు ఆ గుర్తింపు రద్దు, తొలి స్థానంలో ఏపీ
Recommended Video
హైదరాబాద్: అక్కినేని కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్కు చెందిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆదాయపు వివరాలను ఇవ్వని పలు ఎన్జీవోల గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఎన్జీవోలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన 190, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో అక్కినేని ఫౌండేషన్ కూడా ఉంది.
కేంద్రం ఆదేశాలు
విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వార్షిక ఆదాయ వివరాలను అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వివరాలను సమర్పించని సంస్థలపై తాజాగా కేంద్రం వేటు వేసింది.
విరాళాలు పొందలేవు
ఎఫ్సీఆర్ఏ లేని ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలు పొందలేవు. ఇప్పుడు దీనిని రద్దు చేయడంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విదేశాల నుంచి విరాళాలు పొందలేదు.
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను 2005లో అక్కినేని నాగాశ్వర రావు ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తుంటారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందిస్తున్నారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలను ప్రోత్సహిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కోల్పోయిన వాటిలో కొన్ని
ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోయిన వాటిలో బిర్లా ఆర్కియాలాజికల్ కల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో పాటు పలు విద్యా సంఘాలు, క్రైస్తవ, ముస్లీం మత సంఘాలు కూడా ఉన్నాయి.
దేశంలోనే తొలి స్థానంలో ఏపీ
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి గడిచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2010-11 నుంచి 2015-16 వరకు) సుమారు 10వేల స్వచ్చంధ సంస్థలు వారి వార్షిక రిటర్నులను దాఖలు చేయలేదని కిరణ్ రిజిజు తెలిపారు. రిటర్నులు దాఖలు చేయనివారిపై ఎఫ్సీఆర్ఏ 2010 ప్రకారం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేమన్నారు. దీనిని ఆసరంగా తీసుకొని చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఎన్జీవోలపై తక్షణమే చర్యలు చేపట్టామన్నారు. వార్షిక రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా 5900కు పైగా ఎన్జీవోలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 4867 ఎన్జీవోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్లు కోల్పోయిన ఎన్జీవోల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.