హెల్త్ అలర్ట్: హైదరాబాదులో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ...తెలంగాణలో నమోదైన కేసులు ఇవే..!
హైదరాబాదు: తెలంగాణలో వ్యాధులు అతివేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాతావరణంలో మార్పులు చేసుకోవడంతో విషజ్వరాలు, డెంగ్యూ, చికన్ గున్యా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక వర్షాలు కురుస్తుండటంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా దోమలు చేరుతున్నాయి. దీంతో ప్రజలకు వ్యాధులు వస్తున్నాయి. ఏ హాస్పిటల్ చూసినా జబ్బు చేసిన వారితో కిటకిటలాడుతున్నాయి. తాజాగా స్వైన్ ఫ్లూ వ్యాధి తెలంగాణలో విజృంభిస్తోంది. దేశం మొత్తం మీద రికార్డు స్థాయిలో స్వైన్ ఫ్లూ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. దేశంలో స్వైన్ ఫ్లూ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది.
స్వైన్ ఫ్లూ కేసుల్లో ఆరోస్థానంలో తెలంగాణ
ఇక తొలి ఐదు స్థానాల్లో రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కర్నాటకలు ఉన్నాయి. ఇంకా స్వైన్ ఫ్లూకు అసలైన సీజన్ ప్రారంభం కాకుముందే ఈ వైరస్ ప్రజలను ఇబ్బందిపెడుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1277 స్వైన్ ఫ్లూ కేసులు తెలంగాణలో నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. క్రితం వారంలోనే 12 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది 1007 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అందులో 28 మంది మృతి చెందారు. అయితే గతేడాది ఆగష్టులో 21 కేసులు నమోదు కాగా మిగతా కేసులన్నీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో నమోదయ్యాయి.
సెప్టెంబర్ నెల రాకముందే విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రోజుకు నాలుగు నుంచి ఐదు డజన్ల స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి.బుధవారం మూడు కొత్త కేసులను గుర్తించగా... రెండు హైదరాబాదులో ఒకటి మహబూబ్నగర్లో గుర్తించడం జరిగింది. ఇక అనుమానంగా ఉన్న స్వైన్ ఫ్లూ కేసుల్లో మొత్తం 68 కేసులను పరీక్షించారు. సాధారణంగా స్వైన్ ఫ్లూ కేసులు సెప్టెంబర్ నెలలో బయటపడతాయి.ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య ఈ వైరస్ తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ ఏడాది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ పేషంట్లకు జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఫీవర్ హాస్పిటల్లో అయితే 24 గంటలు వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాదులోనే అత్యధిక కేసులు
ఇప్పటి వరకు 659 కేసులు నమోదు కాగా.. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే స్వైన్ ఫ్లూ కేసులను గుర్తించడం జరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత మేడ్చల్లో 224 కేసులు, రంగారెడ్డిలో 206 కేసులు గుర్తించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మూడు ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. ఇదిలా ఉంటే తీవ్ర జ్వరం, తుమ్ములు, దగ్గు, ఒళ్లు నొప్పులు వస్తే మాత్రం వెంటనే డాక్టరును సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.