అన్నీ పరీక్షలు వాయిదా: దసరా తర్వాతే నిర్వహణ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతోన్నాయి. హైదరాబాద్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ప్రస్తుతం షెడ్యూల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరిస్థితి సద్దుమణిగాక పరీక్షలను నిర్వహిస్తామని ఆమె సూత్రప్రాయంగా తెలిపారు.
అల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ సర్వే - కీలక ఆదేశాలు
వర్షాల వల్ల పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వాయిదా పడిన పరీక్షలనీ దసరా పండగ తర్వాత నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ఇప్పటికే ఓయూ, జేఎన్టీయూ-హెచ్, అంబేద్కర్ యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీ పరిధిలో అన్ని పరీక్షలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బీఈడీ పరీక్షలు, డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ పరీక్షలు కొన్నిరోజుల కిందటే వాయిదా పడ్డాయి. ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను కూడా దసరా వరకు వాయిదా వేస్తున్నామని మంత్రి వివరించారు. త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపారు.
Recommended Video
ఎల్లుండి జరగాల్సిన జేఎన్టీయూ హైదరాబాద్, అనుబంధ కళాశాలలో రేపు, ఎల్లుండి జరగాల్సిన యూజీ, పీజీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు జేఎన్డీయూ ప్రకటనలో తెలిపింది. తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ తెలిపారు. ఈ నెల 27 నుంచి జరగాల్సిన పరీక్షల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.