ఇటు దుబ్బాక... అటు బిహార్... నేడే ఎన్నికల ఫలితాలు... ఓటరు దేవుడు ఎవరివైపు...
ఇటు దుబ్బాక ఉపఎన్నిక... అటు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు... రెండింటి ఫలితాలు ఈరోజే వెల్లడికానున్నాయి. దుబ్బాక ఫలితం కోసం తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా.. బిహార్ ఫలితాల కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. దుబ్బాకలో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన హోరాహోరీ త్రిముఖ పోరులో ఓటరు దేవుడు అంతిమంగా ఎవరి వైపు నిలిచాడో నేటితో తేలిపోనుంది. అటు బిహార్ ఎన్నికల్లో ఈసారి 'తేజస్వి వేవ్' ఖాయమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా.. గ్రౌండ్ రియాలిటీ అదేనా.. లేక ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈసారి కూడా తలకిందులవుతాయా అన్నది నేటి ఫలితాలతో తేలనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 57 ఉపఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి.
Recommended Video
దుబ్బాకలో పరిస్థితేంటి....
దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక్కడ విజయం సాధించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను బయటపెట్టాలనే భావనలో కాంగ్రెస్ ఉంది. ఇక టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునేందుకు దుబ్బాక తమకు అందివచ్చిన అవకాశమని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలతో దుబ్బాక ఫైట్ ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీ మధ్యే అన్న సీన్ క్రియేట్ అయింది. అయితే గ్రౌండ్లో పరిస్థితి నిజంగా అలానే ఉందా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా... ఇవన్నీ నేటితో తేలిపోతాయి. టీఆర్ఎస్ తరుపున దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత,కాంగ్రెస్ తరుపున చెరుకు శ్రీనివాసరెడ్డి,బీజేపీ తరుపున రఘునందన్ రావు ఇక్కడినుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందూరు కాలేజీలో కౌంటింగ్...
సిద్దిపేట శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో దుబ్బాక ఓట్ల లెక్కింపు జరగనుంది. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 14 టేబుళ్లపై 23 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక గదిలో 1 నుంచి 7 వరకు,మరో గదిలో 7 నుంచి 14 వరకు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ రౌండ్లో 14 పోలింగ్ బూత్ల ఓట్లను లెక్కిస్తారు. 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుండగా... మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటివరకూ 1453 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత... 8.30గంటల నుంచి ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సీపీ డేవిస్ జోయల్ తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలు,రాష్ట్ర సాయుధ బలగాలు,స్టేట్ సివిల్ ఫోర్సెస్తో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
బిహార్లో పరిస్థితేంటి...
ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. బిహార్ పొలిటికల్ ట్రెండ్ జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో... ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పోటీ ఎన్డీయే వర్సెస్ మహాకూటమిగా సాగిన నేపథ్యంలో... ఇరువురిలో జనం ఎవరిని విశ్వసించారన్నది తేలిపోనుంది. నిరుద్యోగ సమస్య,వలసలు,వరదలు ప్రధానాంశాలుగా సాగిన పోరులో జనం తేజస్వి నేత్రుత్వంలోని మహాకూటమికి పట్టం కట్టబోతున్నారా... లేక నితీశ్ నేత్రుత్వంలోని ఎన్డీయేకి పట్టం కట్టబోతున్నారా అన్నది కొద్ది గంటల్లో తేలనుంది. మొత్తం మూడు దశల్లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 28వ తేదీన 71 స్థానాలకు, ఈనెల 3వ తేదీన 94 అసెంబ్లీ స్థానాలకు, ఈనెల 7వ తేదీన 78 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
57 ఉపఎన్నికల ఫలితాలు నేడే....
దుబ్బాక సహా దేశవ్యాప్తంగా 56 ఉపఎన్నికల ఫలితాలు కూడా నేడే వెల్లడికానున్నాయి. అలాగే బిహార్లోని వాల్మీకి లోక్సభ బైపోల్ ఫలితం కూడా వెల్లడికానుంది. మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు,ఉత్తరప్రదేశ్లో 8 అసెంబ్లీ స్థానాలకు,గుజరాత్లో 8 అసెంబ్లీ స్థానాలకు,కర్ణాటక,ఒడిశా,జార్ఖండ్,నాగాలాండ్,మణిపూర్లలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున,తెలంగాణ,హర్యానాలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి.