మీ డబ్బులు మాకెందుకు: మంత్రి హరీష్ రావు రాకపోవడంపై ఆగ్రహం
హైదరాబాద్: అంధులు అంటే అంత చిన్నచూపా? మా సభలకు రావడం మీకు నామోషీగా ఉందా? అలా అయితే మీ విరాళాలు మాకు ఎందుకు? అంటూ ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ సెక్రటరీ జనరల్ జెఎల్ కౌల్ మంగళవారం నాడు అన్నారు.
అంధులంటే చిన్న చూపా, మా సభలకు వస్తే నామోషీ అనుకుంటున్నారా, నాయకులను నమ్ముకుంటే సమయం వృథా అని, అంధులమైన మనమే కలిసి ముందుకు వెళ్దామని వ్యాఖ్యానించారు. మీ విరాళాలు మాకు వద్దని మంత్రి హరీష్ రావు పైన మండిపడ్డారు.
సమావేశాల కోసం మంత్రి హరీష్ రావు స్వయంగా అందించిన రూ.2 లక్షల విరాళాన్ని వెనక్కి ఇచ్చేద్దామని జెఎల్ కౌల్ నిర్ణయించారు. ఆయన ప్రకటించిన నిర్ణయాన్ని సభలోని వారంతా ఆమోదించారు.
ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ డెవలప్మెంట్ (ఢిల్లీ), వెల్ఫేర్ ఆఫ్ ది బ్లైండ్ (నల్గొండ) సంయుక్తంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంధుల జాతీయ సదస్సు మంగళవారం నాడు ముగిసింది. సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి హరీష్ రావును కోరారు.
అయితే, ఆయన గైర్హాజరయ్యారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ విరాళాలు మాకు అవసరం లేదని తేల్చి చెప్పారు.
సంగారెడ్డి జైలు నుంచి ఖైదీ పరారీ
సంగారెడ్డి మండలం కంది జిల్లా జైలు నుంచి ఖైదీ యాదగిరి పరారయ్యాడు. ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాదగిరి పరారు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యాదగిరి స్వస్థలం తూప్రాన్ మండలం గెండ్రెడ్డిపల్లి గ్రామం.