కెసిఆర్కు దగ్గరగా.. దూరంగా!: అందులోను రామోజీరావులో మార్పు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య స్నేహం విరబూసినట్లే... కెసిఆర్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుల మధ్య స్నేహం కుదిరిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం సమయంలో టిఆర్ఎస్కు చెందినవాళ్లు ఎప్పటికప్పుడు పలు పత్రికల పైన ఆంధ్రా పత్రికలు అంటూ మండిపడేవారు. అందులో ఈనాడు కూడా ఉండేది. అయితే, తెలంగాణ సిద్ధించాక.. కెసిఆర్ రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు.
దీంతో ఇరువురి మధ్య బంధం బలపడిందనే వాదనలు వినిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం కృష్ణా నీటి విషయంలో ఈనాడు రాసిన కథనం పైన కెసిఆర్కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ నీటి సమస్య విషయంలోను విమర్శలు చేశారు.
అయితే, తాజాగా రామోజీ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్లో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి హాజరయ్యారు. రామోజీ రావుకు కెసిఆర్ స్వయంగా స్వాగతం పలికారు. చండీయాగం వద్ద రామోజీ రావు హోమగుండం వద్ద ప్రదక్షిణలు చేశారు.
మరో విషయమేమంటే... రామోజీ రావులో మార్పు వచ్చిందనే వారు ఉన్నారు. గతంలో రామోజీ రావు నాస్తికుడిగా ఉన్నాడని, ఇటీవల ఆయనలో ఆధ్యాత్మికం కనిపిస్తోందని చెబుతున్నారు. రామోజీ రావు ఓం సిటీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.