ఆర్టీసి ఉద్యోగుల పట్ల సీఎం కఠిన వైఖరి..! ఢిల్లీ లో తేల్చుకుంటామంటున్న అఖిలపక్ష నేతలు..!!
హైదరాబాద్: అఖిల పక్ష నేతలు మరోసారి గవర్నర్ ని కలిసారు. ఆర్టీసి కార్మికుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడంతో పాటు, ప్రభుత్వం తరుపున కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయని, కార్మిక హక్కులకు విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని గవర్నర్ కు విజ్ఞప్తి చేసారు అఖిలపక్షనేతలు. 47రోజుల పాటు కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల జోక్యం చేసుకుని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయమని అఖిలపక్ష నేతలు గవర్నర్ ను కోరారు. అంతే కాకుండా లేబర్ కమీషనర్ పరిధిలో సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించడంతో, ఆదిశగా తమకు న్యాయం జరగదనే అభిప్రాయాన్ని కార్మికులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర స్దాయిలో పోరాటం.. ఢిల్లీ వెళ్లేందుకు నేతల సన్నాహాలు..
అఖిలపక్ష నేతలు ఆర్టీసి కార్మికులకు అనుగణంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. సమస్యను కేంద్ర స్ధాయిలో పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీలకతీతంగా నేతలందరూ కేంద్రప్రభుత్వాన్ని సంప్రదించి సమ్మె గురించి వివరించి న్యాయం జరిపించమని విజ్ఞప్తి చేయనున్నారు. కాంగ్రెస్, బీజేపి, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, సీపిఎం, ఇంటి పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఆర్టీసి కార్మికులు 47రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం చంద్రశేఖర్ రావు మొండిగా వ్యవహరిస్తున్నారని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాల్లేక ఆర్టీసి ఉద్యోగులు దుర్బర జీవితం అనుభవిస్తున్నారని అఖిల పక్ష నేతలు చెప్పుకొస్తున్నారు.
కొనసాగింపా..? ముగింపా..? ఎటూ తేల్చుకోని జేఏసి నేతలు...
ఇక ఇదే సమ్మె పట్ల కార్మికుల్లో సందేహాలు నెలకొన్నాయి. కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందనుకున్న కార్మికులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. లేబర్ కమీషనర్ పరిధిలో సమస్యకు పరిష్కరం చూడాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమ్మెను కొనసాగించాలా ? వద్దా? అనే అంశంపై తర్జనబర్జన పడుతున్నారు. మంగళవారం ఈ అంశంపై అన్ని యూనియన్ల నేతలు వేర్వేరుగా సమావేశమై.. అక్కడ సేకరించిన అభిప్రాయాలను జేఏసీలో చర్చించారు. నేడు కోర్టు తీర్పు కాపీలు అందిన తర్వాత మరో సారి ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
స్వచ్ఛందంగా చేరితే ఎట్లా.. చులకనైపోతామంటున్న కార్మికులు..
అంతే కాకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకుండా విధుల్లో చేరడం సరికాదని మెజారిటీ డిపో స్థాయి నేతలు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేరితే ఇన్నాళ్లు చేసిన సమ్మెతో పాటు తీవ్రమైన అణిచివేత నడుమ సాగిన ఉద్యమానికి అర్థం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా సమ్మె విరమించినా ప్రభుత్వం కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకుంటుందా?..లేదా? అనే సందేహం పలువురు కార్మికుల్లో వ్యక్తం అవుతోంది. ఒక వేళ చేర్చుకున్నా యూనియన్లలో చేరమని లెటర్ రాసి ఇస్తేనే చేర్చుకుంటామని కండిషన్ పెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇన్ని సందేహాలు, అభిప్రాయ బేధాలు ఉన్నా సమ్మెపై జేఏసీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్ని యూనియన్ల నేతలు స్పష్టం చేయడం కొసమెరుపు.
నేడు న్యాయ నిపుణులతో సమావేశం.. తదుపరి తుది నిర్ణయం..
హైకోర్టు తీర్పు కాపీలో ఉన్న అంశాలపై నేడు జేఏసీ నేతలు తమ లాయర్లు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అనంతరం జేఏసీ నేతలు మరో సారి సమావేశమై, విస్తృతంగా చర్చించి సమ్మెపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కార్మిక సంఘాలు నిర్ణయం ప్రకటించిన తర్వాత తమ వైఖరి వెల్లడించాలని, అప్పటి వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆర్టీసీలో మళ్ళీ ఉద్యోగం రాదనే బెంగతో తీవ్ర మనస్థాపానికి గురైన మరో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. నర్సంపేట డిపోకి చెందిన డ్రైవర్ ఎండి యాకూబ్ పాషా(52) మంగళ వారం సాయంత్రం 5 గంటలకు వరంగల్ ఎంజీఎంహాస్పటల్ లో గుండెపోటుతో కన్ను మూశారు.