కొత్త జిల్లాల ఏర్పాటు వేగవంతం, కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే 27 జిల్లాలతో కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను ఖరారు చేయగా.. దీనిపై శనివారం మధ్యాహ్నాం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి వినిపించనున్నాయి. అలాగే ఏ ప్రాతిపదికన కొత్తగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరుపుతున్నారనే దానిపై కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది. తెలంగాణలో ఉన్న ఏడు పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
కాగా, అఖిలపక్ష సమావేశం అనంతరం.. ఆయా పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. దసరా నాటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే గద్వాల్, జనగామ ఏర్పాటు జిల్లాల డిమాండ్ లు, కొత్తగా జాబితాలో చేర్చిన పెద్దపల్లి జిల్లా కేంద్రాల ప్రస్తావన కూడా అఖిలపక్ష భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.