సర్వం సిద్దం.. ప్రసంగించేది ఇద్దరే.. : మోడీ పర్యటన ఏర్పాట్లపై హరీశ్
మెదక్ : ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లన్నీ త్వరితగతిని పూర్తి చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్న మంత్రి హరీశ్ రావు.. మోడీ పర్యటన రోజు ఏర్పాట్ల గురించి వివరించారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయడంతో పాటు.. మొత్తం ఐదు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారని స్పష్టం చేశారు హరీశ్. అనంతరం గజ్వేల్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, సభకు సుమారు 2 లక్షల మంది ప్రజానీకం హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు హరీశ్.
మోడీ రాక: ఏర్పాట్లలో తలమునకలైన హరీశ్ రావు(పిక్చర్స్)
సభా వేదిక మీద 18 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామని.. బహిరంగ సభలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మాత్రమే ప్రసంగిస్తారని హరీశ్ రావు తెలిపారు. మోడీ పర్యటన నిమిత్తం మొత్తం నాలుగు హెలిప్యాడ్ లను ఏర్పాటు చేశామని, పార్కింగ్ ఇబ్బందులకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఇందుకోసం 170 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు హరీశ్.
ఇకపోతే సభా నిర్వహణలో వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి పూర్తి స్థాయి రెయిన్ ప్రూఫ్ టెంట్లను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామన్నారు హరీశ్. సభలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని చెప్పారు.