ఎపి ఆదేశాలతో ఆలర్ట్: ఆ సంస్థలన్నీ మావేనన్న రాజీవ్ శర్మ
హైదరాబాద్: పదో షెడ్యూలులోని సంస్థల నిధులను పీడీ ఖాతాలకు తరలించాలని ఆదేశించడంతో పాటు సుపరిపాలనా కేంద్రానికి సొంతంగా డైరెక్టర్ జనరల్ను నియమించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలకమైన సంస్థలకు తమ అధిపతులను (హెడ్స్ను) నియమించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటిపై స్పష్టత ఇస్తూ ఆ సంస్థలన్నీ తెలంగాణవేనని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి నుంచి సేవలు పొందాలనుకుంటే ఫీజు చెల్లించాలని అన్నారు. ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఎపి ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్లిపోతామంటే రిలీవ్ చేయాలని సూచించారు. గురువారం రాజీవ్శర్మ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితోపాటు వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, విభాగాల అధిపతులతో దాదాపు నాలుగు గంటలపాటు సమీక్ష జరిపారు.
విభజన చట్టంలోని పదో షెడ్యూలులో ఉన్న సంస్థల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పదో షెడ్యూల్లో 141 సంస్థలున్నాయని, వాటిలో 104 సంస్థలపై పూర్తి అధికారం తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఈ సంస్థల పేరిట బ్యాంకుల్లో ఏపీ ప్రభుత్వం ఖాతాలు తెరవకుండా, నిధులు తరలించకుండా అడ్డుకోవాలని, బ్యాంకులకు ఆ మేరకు లేఖలు రాయాలని చెప్పారు.
ఈ సంస్థల నిర్వహణ బాధ్యతలు తెలంగాణ ఉద్యోగులు, అధికారులకే అప్పగించాలని సీఎస్ ఆదేశించారు. ఏడాది కావస్తున్నా తమకు కొత్త సంస్థలు ఏర్పాటు చేసుకోకుండా ఏపీ పేచీ పెడుతోందని అన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంటే, అది ఆ రాష్ట్రానికే చెందుతుందని ఉన్నత విద్యామండలి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ ఆ సంస్థలు తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు.
పదో షెడ్యూల్లో ప్రధానంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్), మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ), సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తోపాటు మరో 11 సంస్థలపై ఏపీ ప్రభుత్వం పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. ఆయా సంస్థలకు చెందిన ఖాతాలు, ఉద్యోగుల విభజన వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండకపోతే నష్టం జరుగుతుందని, ఉమ్మడి సంస్థల ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి ఒక్కటి తప్ప మిగిలిన జాతీయ బ్యాంకులన్నీ అంగీకరించాయని సీఎస్ వివరించారు. షెడ్యూల్డ్ 9లోని సంస్థల ఆస్తుల విభజనపై షిలాబిడే కమిటీ నివేదిక ఇచ్చాకే ముందుకెళ్లాలన్నారు.
రాజకీయ నియామకాలు చేపట్టొచ్చు: ఏజీ
పదో షెడ్యూల్ సంస్థలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసుకోవచ్చని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సీఎస్, అడ్వొకేట్ జనరల్లు గవర్నర్ నరసింహన్తో ఈ సమావేశానికి ముందే భేటీ అయ్యారు.