కరోనా లాక్డౌన్లో మీ బండి సీజ్ చేశారా? వాటిపై పోలీసుల కీలక నిర్ణయం.. ఎలా తీసుకోవాలంటే..
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ గడువును పొడగించాయి. లాక్ డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా పర్సనల్ వెహికల్స్ ను కూడా వాడుకోవచ్చని మార్గదర్శకాల్లో చెప్పారు. కాగా, ఇదివరకే నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా లక్షలాది వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వాటన్నింటినీ యజమానులకు తిరిగి అప్పగించేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇదివరకే చెప్పారు. అయితే ఆ ప్రక్రియ ఎలా ఉంటుందనేదానిపై హైదరాబాద్ పోలీసులు శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
కరోనా షాకింగ్: తీరుమార్చుకున్న వైరస్.. వూహాన్లో మళ్లీ బీభత్సం.. బిడెన్-చైనా బంధంపై ట్రంప్ ఫైర్
సీజ్ కు గురైన వాహనదారులందరూ తప్పనిసరిగా కేసు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన పోలీసులు.. ఇప్పుడు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులెవరూ కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో ఈ-కోర్టు ద్వారా కేసులను పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించారు.
లాక్ డౌన్ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా 4.5లక్షల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వాటిలో జంట నగరాల్లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే సుమారు 3.25 లక్షల వాహనాలున్నాయి. ఇంతమంది నిందితులను విచారించాలంటే నెలల సమయం పడుతుంది కాబట్టి, కేసుల్ని వీడియో కాన్ఫరెర్సుల ద్వారా చేపట్టాలన్న పోలీసుల రిక్వెస్ట్ కు కోర్టులు అంగీకరించాయి. వాహనాలను, నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిల ముందు ప్రవేశపెడతారు. ఈ మేరకు కేసులు నమోదైన వారికి ముందుగానే విచారణ తేదీ, టైమ్ స్లాట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Recommended Video
స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన కేసులతోపాటు.. లాక్ డౌన్ లో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరవడం, అధిక ధరలకు సరుకులు విక్రయించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించపోవడం, నకిలీ శానిటైజర్లు అమ్మడం తదితర కేసులను కూడా ఈ -పెటీ కేసులుగానే పరిగణించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపటనున్నారు. కొద్దిరోజుల కిందటి హైకోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత బాండ్లు సమర్పించిన వారికి వాహనాలను తిరిగిచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.