కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్లో విందు, ఒకే కారులో రానున్న ఇవాంకా, మోడీ, మహారాణి స్థాయిలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకు ప్రధాని మోడీ ఈ రాత్రి ఇవ్వనున్న విందు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఫలక్ నుమా ప్యాలస్ లో ఈ విందు కార్యక్రమం జరగనుంది.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకు ప్రధాని మోడీ ఈ రాత్రి ఇవ్వనున్న విందు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఫలక్ నుమా ప్యాలస్ లో ఈ విందు కార్యక్రమం జరగనుంది.
Recommended Video
రాత్రి 8.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ విందుకు ఇవాంకా ట్రంప్, కేసీఆర్, అమెరికా ప్రతినిధులు, పలువురు రాజకీయ వేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరవుతారు. ఇప్పటికే పలువురు అతిథులు ఫలక్నుమా ప్యాలెస్ను చేరుకుంటున్నారు.
ఒకే కారులో.. మోడీ, ఇవాంకా...
ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే విందులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాత్రి 8 గంటల ప్రాంతంలో తాను బస చేస్తోన్న ట్రైడెంట్ హోటల్ నుంచి బయలుదేరి ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకోనున్నారు. ప్రధాని మోడీ, ఇవాంకా ఒకే కారులో ఇక్కడి చేరుకోనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్కు మోడీ రావడం కూడా ఇదే మొదటిసారి. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. ఇంకా మరికొందరు ముఖ్యఅతిథులు విందుకు హాజరుకానున్నారు.
పూలతో స్వాగతం, గుర్రపుబగ్గీలో...
ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే విందుకు హాజరుకానున్న ప్రధాన అతిథి ఇవాంకా ట్రంప్కు రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. ఈ విశిష్ట స్వాగతంలో భాగంగా ఆమెకు ప్యాలెస్ ప్రధాన ద్వారం వద్ద గులాబీ పూల గుచ్ఛాలతో స్వాగతం పలికిన అనంతరం మహారాణి స్థాయిలో గుర్రపు బగ్గీలో ప్యాలెస్ లోపలికి తీసుకెళతారు. అతిథులు కూడా తమ కార్లను ప్యాలెస్ ప్రధాన గేటు దగ్గరే నిలిపివేస్తారు. అతిథులందరూ గుర్రపు బగ్గీలు, ఎలక్ట్రిక్ కార్లలో ప్యాలెస్ వద్దకు చేరుకుంటారు.
రీగల్ 101 డైనింగ్ హాల్లో...
ఫలక్నుమా ప్యాలెస్లోని 101 డైనింగ్ హాల్లో ఈ విందు జరగనుంది. అతిథులకు విందు ఇచ్చేందుకు నిజాం రాజు ఫలక్నుమా ప్యాలెస్లో ఈ డైనింగ్ హాల్ను నిర్మించారు. ఇప్పుడు ఇదే డైనింగ్ హాల్ ఇవాంకాకు ఇవ్వనున్న విందు కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రధాని మోడీ ఇస్తున్న ఈ విందులో పలు వంటకాలు అతిథులకు నోరూరించబోతున్నాయి.దేశ, విదేశీ వంటకాలతోపాటు స్థానిక వంటకాలను కూడా వడ్డించనున్నారు. రాత్రి 10 గంటల వరకూ అతిథులు ఫలక్నుమా ప్యాలెస్లోనే గడపనున్నారు.
ఇవాంకా ఏం తింటుందో?
ఫలక్నుమా ప్యాలెస్లో ఇచ్చే విందులో ఇవాంకా ఏం తింటుందనేది ప్రధాన అంశంగా మారింది. హైదరాబాద్ బిర్యానీని రుచి చూస్తానంటూ ఆమె ఇప్పటికే పేర్కొంది. ఈ విందులో ముఖ్యంగా గంధం, కుంకుమ వేళవించిన వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఘోస్ట్ షికాంపురీ కీబాబ్, దహీ కే కీబాబ్, కుబానీ కే మలాయ్ కోఫ్తా, ముర్గ్ పిస్తా కా సలాన్, సితాఫల్ కుల్ఫీ, అఘజ్ సూప్, వాక్ఫా, మెజ్ బన్, మహ్ గూల్ దస్తర్ క్వాన్, గులాబ్ జామ్ తదితర ఎన్నో వెరైటీలు అతిథుల కోసం రెడీ అవుతున్నాయి. వీటన్నింటితో పాటు భారతీయ, హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మరిన్ని వంటకాలు ఉంటాయి. ఒక్కో అతిథికి ఒక్కో వ్యక్తి ఈ వంటకాలన్నింటినీ వడ్డించనున్నారు.