జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు: అల్లం నారాయణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్లు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మూడు దశల్లో కార్డులు జారీ చేయాలని బుధవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలశాఖ కార్యాలయంలో జరిగిన అక్రెడిటేషన్ల కమిటీ సమావేశం తీర్మానించింది.
సమావేశానంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మీడియాతో మాట్లాడారు. తొలిదశలో ఇప్పటివరకు కార్డులు ఉన్న జర్నలిస్టులకు వెంటనే కార్డులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను రెండు రోజుల్లో పరిశీలించి జూలై మొదటి వారంలోగా అందరికీ కార్డులు అందజేయాలని నిర్ణయించింది.
Photos: మీడియాతో అల్లం నారాయణ
జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రస్తుత అక్రెడిటేషన్ కార్డుల గడువు పొడిగించాలని నిర్ణయించింది. ఈలోగా అక్రెడిటేషన్లు ఇవ్వడానికి కమిటీలు వేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈలోగా సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమావేశం తర్వాత మీడియాకు చెప్పారు.
రాష్ట్రంలోని పత్రికల యాజమాన్యాలు అక్రెడిటేషన్ల జాబితాలో తెలంగాణ జర్నలిస్టుల పేర్లు చేర్చకపోతే నేరుగా తమ కమిటీకి లేదా, రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలశాఖలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. త్వరలో జర్నలిస్టులందరికి హెల్త్కార్డులు వస్తాయన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత ఫైల్పై సంతకం చేశారన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సీఎం కే చంద్రశేఖర్రావుకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
సమావేశంలో విరాహత్ అలీ (టీఎస్యూడబ్ల్యూజే), పల్లె రవికుమార్ (టిజేఎఫ్ - టీయూడబ్ల్యూజే), సతీశ్ (ప్రింట్ మీడియా), తిప్పన కోటిరెడ్డి (హెచ్యూజే), గంగాధర్ (ఫోటో గ్రాఫర్స్), క్రాంతి కిరణ్ (ఎలక్ట్రానిక్ మీడియా), బైసా దేవదాస్ (చిన్న పత్రికలు), గడ్డం సౌమ్య (మహిళా జర్నలిస్టు ప్రతినిధి), ప్రకాశ్ (వీడియో జర్నలిస్టు) పాల్గొన్నారు.