తెలంగాణలో పొత్తులు ఖరారు..! గతంలో గెలిచిన సీట్లపైనే టీటీడిపి ఫోకస్..!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి పొత్తుల పట్ల ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ప్రణాళిక రచిస్తోంది టీటిడిపి. సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో చర్చలు జరిపిన టీటీడిపి అద్యక్షుడు యల్ రమణ జనసమితి అధినేత కోదండరాంతో సోమవారం చర్చలు జరపబోతున్నారు. దీంతో గెలిచేనియోజకవర్గాలే కాకుండా గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచిన స్థానాల పట్ల టీడిపి కన్నేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జిల్లాల్లో ఎక్కువ సీట్లను తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో మహాకూటమి..! పావులు కదుపుతున్న టీటీడిపి..!
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తుకు లైన్ క్లియర్ అయింది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకులు ‘సేఫ్' జోన్ ను వెతుక్కునే పనిలో పడ్డారు. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఖరారు అయినా కరీంనగర్ లోని ఆయన సొంత నియోజకవర్గం జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కాదని రమణకు టిక్కెట్ దక్కే ఛాన్స్ ఏ మాత్రం లేదు. దీంతో ఎవరిని నొప్పించకుండా, ఎవరికి పోటీ కాకుండా ఉండాలని రమణ భావించినట్టు తెలుస్తోంది. అందుకోసం కూకట్ పల్లి నియోజకవర్గం ఐతే తనకు అనుకూలంగా ఉంటందనే అంచనాకు వచ్చినట్టు సమాచారం.
గతంలో గెలిచిన సీట్లే టార్గెట్..! అవి మాకే అంటున్న తెలుగుతమ్ముళ్లు..!
అందుకే రమణ కూడా హైదరాబాద్ లోని కూకట్ పల్లి సీటు నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక్కడ వాతావరణం సహజంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది. మరో టీడీపీ నేత అరవింద్ కుమార్ గౌడ్ రాజేంద్రనగర్ అసెంబ్లీ నుంచి, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేంద్ర గౌడ్ ఉప్పల్ నుంచి బరిలో నిలవనున్నారు. టీడీపీ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లోని సీట్లపైనే కన్నేసింది. ఇక్కడ టీడీపీకి ఓటు బ్యాంకు గణనీయంగా ఉండటంతో పాటు, రెండు పార్టీలు కలసి పోటీచేస్తున్నందున విజయావకాశాలు ఈజీ అని నమ్ముతున్నారు. అందుకే ఎవరికి ఎక్కువ అనుకూలంగా ఉన్న నియోజకవర్గంలో వారు పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే కీలకం..!మెజారిటీ సీట్లు గెలుస్తామంటున్నటీడిపి నేతలు..!
గత ఎన్నికల్లో టిడీపీ ఎక్కువ సీట్లను గెలిచింది గ్రేటర్ పరిధిలోనే కావటం విశేషం. గెలిచే సీట్లనే చూసి ఎంపిక చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా తెలంగాణ తెలుగుదేశం నేతలు కూడా కాంగ్రెస్ కు గట్టి పట్టులేని, తమకు అనుకూలమైన నియోజకవర్గాలను ఎన్నుకునే క్రమంలో పడ్డారు. పొత్తు ద్వారా ఇలాంటి నియోకవర్గాలను ఎంపిక చేసుకుంటే గెలుపు ఛాన్స్ మెరుగ్గా ఉంటుందని నమ్ముతున్నారు. అందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో పోటీ చేయాలని తెలుగుతమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
పరస్పర అవగాహనతో పొత్తులు..! అయోమయం వద్దనుకుంటున్న నాయకులు..!!
సహజంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య రాజకీయ వైరం ఎక్కువ. మరి అలాంటి రెండు పార్టీలు కలిస్తే ఓటర్లు అంత ఈజీగా ఈ పార్టీల కలయికను ఆమోదిస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. మారిన పరిస్థితుల్లో టీడీపీ పొత్తు అనివార్యం అని భావిస్తోంది. అందులో భాగంగానే విమర్శలు ఎన్ని వస్తున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలతోకలసి ముందుకు సాగటానికే నిర్ణయించుకుంది.అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతను కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ఫలితం పొందాలని కాంగ్రెస్, టీడీపి పార్టీలు భావిస్తున్నాయి. అదికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే భావన ప్రజల్లో ఉంటే మాత్రం టీడిపి-కాంగ్రెస్ పార్టీ వేస్తున్న పాచిక తప్పక పారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.