'కేసీఆర్ మనవడికి కూడా ఓ పదవి ఇవ్వండి.. అప్పుడేం చేసినా!..'
ముక్కుపచ్చలారని కేటీఆర్ కొడుకుతో భద్రాచల రాముల వారికి పట్టువస్త్రాలు పంపించడం ఎంతవరకు సమంజసమని రావుల చెన్నారెడ్డి ప్రశ్నించారు.
సిద్దిపేట: ఇటీవల శ్రీరామ నవమి సందర్బంగా భద్రాచల రాముల వారికి సీఎం కేసీఆర్ తరుపున ఆయన మనువడు హిమాన్షు పట్టువస్త్రాలు సమర్పించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్థానంలో అతని మనువడు బట్టలు సమర్పించడమేంటని చాలామంది విమర్శించారు. ఇప్పటికీ ఈ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా హైకోర్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు రావుల చెన్నారెడ్డి దీనిపై స్పందించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందని అన్నారు. సోమవారం నాడు ములుగులో చెన్నారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
ముక్కుపచ్చలారని కేటీఆర్ కొడుకుతో భద్రాచల రాముల వారికి పట్టువస్త్రాలు పంపించడం ఎంతవరకు సమంజసమని రావుల చెన్నారెడ్డి ప్రశ్నించారు. అవసరమనుకుంటే కేసీఆర్ మనువడికి కూడా ఓ పదవి కేటాయించి, ఆ తర్వాత ఇలాంటి పనులు చేయించుకోవాలని అన్నారు.
రాష్ట్ర కేబినెట్ లో ఉన్న మంత్రులంతా పేరుకే మంత్రులని విమర్శించారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా, ఏ ఒక్క మంత్రికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించలేదని, ఆ మాత్రం దానికి ఇక వారికి పదవులెందుకు? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, ప్రజలందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెన్నారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలకు పాల్పడితే రాబోయే కాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.