మా మామయ్య టిఆర్ఎస్లో యాక్టివ్, రాజకీయం కాదు: అల్లు అర్జున్ (వీడియో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమం పైన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. హరిత హారంలో భాగంగా అల్లు అర్జున్ కుటుంబం వారు కొన్న సైట్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. తన తనయుడితో తొలుత మొక్క నాటించానని ఆయన చెప్పారు. వాళ్ల జనరేషన్కు కూడా ఇవి ఉపయోగపడతాయని, అందుకే తన కొడుకుతో మొదట నాటించానని చెప్పారు. ఓ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం మంచిదన్నారు.
ఓ పాఠశాలనో, కొందరో చేపడితే, అక్కడికే పరిమితమవుతుంటుందని, కానీ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపడితే అందరికీ చేరుతుందని అభిప్రాయపడ్డారు. తన మామయ్య తెరాసలో యాక్టివ్ మెంబర్ అని, మొక్కలు నాటితే బాగుంటుందని ఆయన చెప్పారని పేర్కొన్నారు.
ఈ సైట్ను తాను ఇటీవలే కొన్నానని, ఇక్కడ ఇల్లు కడతానని, అందుకే మంచి కార్యక్రమంతో (మొక్కలు నాటడం) దీనిని ఇప్పుడు ప్రారంభిస్తున్నామని చెప్పారు. హరిత హారం ద్వారా ప్రభుత్వం మంచి పని చేసిందని, తన వ్యాఖ్యల్లో రాజకీయ కోణం లేదని చెప్పారు.
ప్లాంటేషన్ అందరికీ సంబంధించిన విషయమని, పార్టీలకు సంబంధించినది కాదన్నారు. ఒకరోజున 25 లక్షల మొక్కలు నాటివ్వడం బాగుందని అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వం కార్యక్రమం అయినప్పటికీ సామాజిక బాధ్యత కాబట్టి అందరు ముందుకు తీసుకు వెళ్లాలన్నారు.
మొక్కలు నాటే అంశం తన కొడుకు జనరేషన్కు చాలా ముఖ్యమన్నారు. మనం ఏ పనులు చేస్తే అవే పనులు మన పిల్లలు చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి హరిత హారంలో మద్దతిస్తున్నానని చెప్పారు. తనకు రెండు అంశాలంటే ఇష్టమని, ఒకటి మొక్కలు నాటడం, రెండు పిల్లలందరూ చదువుకోవాలనే అంశమన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఒక మంచి పనికి అందరూ ముందుకు రావాలన్నారు. ఈ నగరాన్ని మరింత పచ్చగా చూడాలని, ఇది మంచి ఆలోచన అని హరిత హారాన్ని ప్రశంసించారు. మొక్కలు నాటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. రాశి, జన్మనక్షత్రం ప్రకారం నాటాలని నిపుణులు సూచించారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రముఖ సినీ తారలు అల్లు అర్జున్, దగ్గుబాటి రానా తదితరులు హైదరాబాదులో సోమవారం నాడు మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఒక్క రోజునే 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించింది.
నగరంలో 4,173 ప్రాంతాల్లో 35 లక్షల మొక్కలను నాటేందుకు నగర పాలక సంస్థ మొక్కలను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, అర్జున్ భార్య స్నేహ రెడ్డి, తనయుడు అయాన్లు తమ తమ రాశి, జన్మ నక్షత్రం ప్రకారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అల్లు కుటుంబం తాము కొత్తగా తీసుకన్న సైట్ వద్ద ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. నటుడు దగ్గుబాటి రానా నానక్ రాం గూడలో చెట్లు నాటారు. అందరూ మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.