తాగండి! కానీ, సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు?: అల్లు అర్జున్, రాజమౌళి(వీడియో)
ట్రాఫిక్పై అవగాహన కల్పించారు ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి. రూల్స్ బ్రేక్ చేయడం అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదని, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని ఆయన అన్నారు.
హైదరాబాద్: ట్రాఫిక్పై అవగాహన కల్పించారు ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి. రూల్స్ బ్రేక్ చేయడం అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదని, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని వారు అన్నారు. మన పరిసరాల పరిశుభ్రత, ట్రాఫిక్ తీరు చూసిన వారు మన మనస్తత్వం ఏంటో చెప్పగలరని తెలిపారు.
అల్లు అర్జున్, రాజమౌళి
రోడ్డు ప్రమాదాల నివారణపై శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తోపాటు సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు.
తాగండి.. కానీ..
మందు తాగండి.. కానీ, ఆ మత్తులో వాహనాలను నడపవద్దని అల్లు అర్జున్ సూచించారు. ‘నీ కారణాలు.. తప్పు ముందు నిలబడవు. రూల్స్ కఠినంగా ఉన్నా.. ఇంకా మార్పు రావాలి. చాదస్తం అనుకున్నా సరే.. అవతలి వారి ప్రాణాలతో ఆడుకోవద్దు' అని తెలిపారు.
ఎంజాయ్ చేయండి.. కానీ..
‘మందు తాగిన వాళ్లు.. తాగని వాళ్లతో తమ వాహనాలను నడిపించుకోవాలి. డ్రింక్ చేయవద్దని నేను చెప్పను. కానీ, డ్రింక్ చేసిన వారు వాహనాలను నడపవద్దని చెప్తాను. నేటి యువతరం చాలా బాగుంటుందని తాను నమ్ముతాను. ఎంజాయ్ చేయండి.. కానీ, ప్రమాదాలకు కారణం కావొద్దు' అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కాగా, అల్లు అర్జున్ ప్రసంగిస్తుండగా యువకులు కేరింతలు కొడుతూ మద్దతు తెలిపారు.
మన దేశానికి మనమే శత్రువులం కావొద్దు..
అనంతరం దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. యువతకు అన్ని విషయాల్లో స్పీడు అవసరమని, కానీ, డ్రైవింగ్ విషయంలో మాత్రం ఆ స్పీడ్ అవసరం లేదని చెప్పారు. అతివేగానికి మన రహదారులు అనుకూలంగా లేవని అన్నారు. ‘మనదేశంలో ఉగ్రదాడుల వల్ల ఏడాదిలో సగటున 150 నుంచి 200మంది వరకు చనిపోతున్నారు. మీడియాలో వార్తలొస్తాయి.. మనం ఆవేశపడిపోతుంటాం. కానీ, రోడ్డు ప్రమాదాల్లో లక్షా 40వేల మంది చనిపోతున్నారు. మనకు మాత్రం ఏ కోపం రాదు. మీడియాకు ఇది పెద్ద వార్త కూడా కాదు. మనం చేసే చిన్న చిన్న తప్పుల మూలంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం' అని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రవ్ చేయవద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి మన దేశానికి మనమే శత్రువులుగా మారకూడదని అన్నారు. కాగా, ఈ సందర్భంగా బాహుబలి లాంటి గొప్ప సినిమా తీశారని రాజమౌళిని అల్లు అర్జున్ ప్రశంసించారు.
తప్పించుకోలేరు..
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సేఫ్ అండ్ సెక్యూరిటీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుకుందామన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించి ఈ ప్రచారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. స్ట్రీట్ బేస్ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నగరంలో ఇప్పటికే 15వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 85వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.