కూచిభొట్ల సునయను భారత్ పంపే యత్నం: కానీ..
అమెరికాలో జాతి విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన పెద్ద కష్టం నుంచి బయటపడ్డారు.
వాషింగ్టన్: అమెరికాలో జాతి విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన పెద్ద కష్టం నుంచి బయటపడ్డారు. అమెరికా నుంచి ఆమెను వెనక్కి పంపించే ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోవడంతో పలువురు ముందుకొచ్చి ఆమెకు అండగా నిలిచారు.
నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యంతమైన శ్రీనివాస్ భార్య సునయన(వీడియో)
జాత్యంహంకార కాల్పుల్లో శ్రీనివాస్ మృతి చెందడంతో సునయన అమెరికాలో నివాస హోదాను కోల్పోయి దేశం నుంచి తిప్పిపంపే ముప్పు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ యోడెర్, తదితరులు తాత్కాలికంగా ఏడాది వీసా పొందడంలో సహాయం అందించారు.
దీంతో సునయనకు ఓవర్లాండ్ పార్క్లోని మార్కెటింగ్ ఏజన్సీలో పని చేసుకునేందుకు ఏడాది వీసా మంజూరైంది. తాము ఆమెను తిప్పిపంపబోమని యోడెర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీసాను శాశ్వతంగా మార్చేందుకు కృషిచేస్తున్నట్లు యోడెర్ ఫేస్బుక్లో పేర్కొన్నారు. తన సర్వస్వమైన భర్తను కోల్పోయిన సునయనకు అండగా ఉంటామని చెప్పారు.
ఉగ్రవాదులంటూ కాల్పులు: తెలుగు ఇంజినీర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు
ఈ పరిణామాలపై ఓ ఈమెయిల్లో సునయన స్పందించారు. దురదృష్టకరమైన ఫిబ్రవరి 22న తాను తన భర్తను మాత్రమే కాకుండా, తన వలస హోదాను కోల్పోయాననీ, ఆ హోదాను తాత్కాలికంగానైనా పునరుద్ధరించేందుకు చాలామంది ముందుకొచ్చి సహాయం అందించారనీ, దానిని శాశ్వతంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.