తూచ్ ..నేనెళ్లట్లెదు .. పార్టీ మార్పుపై చేవెళ్ల చెల్లెమ్మ
Recommended Video
హైదరాబాద్ : పార్టీ మార్పుపై గత కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు చేవెళ్ల చెల్లెమ్మ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సబిత పార్టీ మారబోనని స్పష్టంచేసినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది.
రంగంలోకి రేవంత్ ..
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాల పర్వం ఊపందుకొంది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, టీడీపీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య కారెక్కారు. వీరితోపాటు సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా వినిపించింది. సబితకు మంత్రి పదవీ, ఆమె కుమారుడు కార్తీక్ కు టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల కేటీఆర్ తో సమావేశం .. ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి .. పార్టీ మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సూచించారు.
రాహుల్ వద్దకు రేవంత్, సబిత
తాను రంగంలోకి దిగి హామీ ఇవ్వడం గాక పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నారు రేవంత్. అందుకే ఇవాళ సాయంత్రం రాహుల్ వద్దకు తీసుకెళతానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీలో ఇబ్బందులు, సీట్ల కేటాయింపు తదితర అంశాలపై సబితకు హామీ వచ్చే అవకాశం ఉంది. అలాగే తాను కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు లేవని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్ .. ఓటేయ్యద్దంటూ కాంగ్రెస్, టీడీపీ విప్ జారీ
వలసలకు బ్రేక్ పడినట్టేనా ?
పార్టీ మార్పుపై సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గడంతో ఇతర నేతల వలసలకు బ్రేక్ పడనట్టేనా అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి టీఆర్ఎస్ లో మరో ఇద్దరు, ముగ్గురు నేతలు చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే కీలక నేత సబితా ఇంద్రారెడ్డి .. తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో ... మిగతా నేతలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.