కెసిఆర్ 'అమరావతి' టూర్లో స్వల్ప మార్పు: వెళ్లడం వెనుక ఆ 2 కారణాలు!
నల్గొండ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడు గంటల పదిహేను నిమిషాలు ఉంటారు. గం.10.45 నిమిషాల నుంచి గం.2.00 వరకు ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో ఉంటారు.
అమరావతికి వెళ్లేందుకు గాను సీఎం కెసిఆర్ బుధవారం రాత్రి నల్గొండ జిల్లా సూర్యాపేటకు రోడ్డు మార్గాన చేరుకున్నారు. ఆయనకు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, కలెక్టరు సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ స్వాగతం పలికారు.
జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. గురువారం ఉదయం 10.15 గంటలకు ఆయన హెలికాప్టర్లో అమరావతి బయల్దేరుతారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, జగదీశ్వ రెడ్డి వెళ్తున్నారు. వారు 10.45కి అమరావతి చేరుకుంటారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. రెండు గంటలకు అమరావతి నుంచి బయల్దేరి 2.30కి సూర్యాపేటకు చేరతారు. గొల్లబజార్లో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం 4 గంటలకు హెలికాప్టర్లో మెదక్ జిల్లా ఎర్రవెల్లి చేరతారు.
అక్కడ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఆరు గంటలకు రోడ్డు మార్గాన బయల్దేరి నర్సన్నపేటకు చేరతారు. 6.10కి ఇళ్ల శంకుస్థాపనలో పాల్గొంటారు. ఏడు గంటలకు అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరతారు.
ఆ రెండు కారణాలు!
కెసిఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం వెనుక ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు స్వయంగా పిలిచారని, అలాగే, ఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకునేందుకు కెసిఆర్ వెళ్తున్నారని చెబుతున్నారు.
అదే సమయంలో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలను క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగా కూడా కెసిఆర్ అమరావతి పర్యటన ఉందని భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల పైన హైదరాబాదులో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అది రుజువైంది.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే ఇక్కడి సెటిలర్ల మద్దతు తప్పనిసరి. ఈ క్రమంలో చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానం పలికినప్పటికీ అమరావతికి వెళ్లకుంటే జాతీయస్థాయిలో అప్రతిష్టపాలు అయ్యే అవకాశాలే కాకుండా, గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత చవిచూడాల్సి ఉంటుందనే శంకుస్థాపనకు హాజరవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ దుర్గమ్మ దర్శనం
కెసిఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి మరికాసేపట్లో హెలికాప్టర్ లో బయలుదేరనున్న కేసీఆర్ విజయవాడ సమీపంలోని గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉద్ధండరాయునిపాలెం చేరుకోవాల్సి ఉంది.
అయితే నేటి ఉదయం తన షెడ్యూల్ను కేసీఆర్ మార్చుకున్నారు. గన్నవరంలో దిగిన తర్వాత తొలుత ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ఆయన దర్శించుకుంటారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఉద్ధండరాయునిపాలెం బయలుదేరతారు. మరోవైపు, బిజెపి నేతలు కిషన్ రెడ్డి, డాక్టక్ కె లక్ష్మణ్ ఇప్పటికే అమరావతి చేరుకున్నారు.