అమావాస్య నాడు ఎన్నికలు, నేతల ఆందోళన: కలిసి వచ్చేది ఎవరికి, చేదు ఎవరికి?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగనున్నాయి. అమావాస్య రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అమావాస్య రోజు ఎన్నికలు జరుగుతుండటంతో చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారట. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందోనని జనాలు కూడా చర్చించుకుంటున్నారు. ఓ వైపు శుక్రవారం, మరోవైపు అమావాస్య రోజు ఎన్నికలు రావడంపై కొందరు దీనిపై గందరగోళానికి గురువుతున్నారట.
ప్రత్యేక రాష్ట్రం (అధికారికంగా) సిద్ధించిన తర్వాత జరుగుతోన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ఆసక్తిని రేపాయి. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని చెబుతున్న తెరాస మళ్లీ అధికారం నిలబెట్టుకుంటుందా? లేక ఈ నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న మహాకూటమి అధికారం చేజిక్కించుకుంటుందా? అనేది త్వరలో తేలిపోనుంది.
ముహూర్తబలం చూసి నామినేషన్
బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. వివిధ పార్టీల నుంచి అతిరథ మహారథులు జోరుగా ప్రచారం చేశారు. సాధారణంగా చాలామంది అభ్యర్థులు ముహూర్తం చూసుకొని నామినేషన్ దాఖలు చేసే విషయం తెలిసిందే. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సహా ఎంతోమంది వర్జ్యాలు, ముహూర్తాలు నమ్ముతారు. నామినేషన్ దాఖలుకు చివరితేదీ మంచిరోజు అని కొందరు అదే రోజు నామినేషన్ వేశారు.
అమావాస్య రోజు ఎన్నికలు
మన పూర్వీకులు చెప్పిన ఎన్నో అంశాలు శాస్త్రీయంగా రుజువు అయ్యాయి. మన నమ్మకాల్లో ముహూర్తం కూడా ఒకటి. ఈ నమ్మకంలో భాగంగానే మంచి రోజు చూసుకొని నాయకులు నామినేషన్ వేయడం కూడా ఒకటి. ఎంతో మంది నాయకులకు సెంటిమెంట్స్ ఎక్కువ. అమావాస్యను చాలామంది కీడుగా భావిస్తారు. ఇప్పుడు అలాంటి అమావాస్య రోజే ఓటింగ్ జరుగుతోంది. దీంతో చాలామంది అభ్యర్థులు తలలు కూడా పట్టుకుంటున్నారట.
అమావాస్యపై ఆందోళన
అమావాస్య తమకు కలిసి రాదని కొందరు నమ్ముతారు. ఇలాంటి అమావాస్య రోజే ఎన్నికలు రావడం ఎంతో కొంతమంది ఆయా పార్టీల అభిమాన ఓటర్లు లేదా ఆయా పార్టీల కార్యకర్తలలో కన్ఫ్యూజన్కు కారణం అవుతోందట. దీంతో ఆ రోజు గ్రహబలం ఎలా ఉంది, ఏ సమయంలో ఓటు వేస్తే మంచిది అనే ఆలోచనలు కూడా వస్తున్నాయట. నాయకులతో పాటు అభిమాన ఓటర్లకు, కార్యకర్తలకు సెంటిమెంట్స్ ఉంటాయి. కాబట్టి కొంతమంది తాము ఓటు వేసే సమయ వర్జ్యం, రాహుకాలం చూసుకొని ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారట.
నమ్మకం ఉండవచ్చు కానీ
నమ్మకం ఉండవచ్చు. కానీ ఏ సమయానికి వేశామనే దాని కంటే ఎలాంటి నేతకు వేశామనేది ముఖ్యం. గ్రహబలం, రాహు కాలం కంటే భవిష్యత్తు ముఖ్యమనేది కొందరి అభిప్రాయం. వర్జ్యం, రాహుకాలం... వంటివి ఎలా ఉన్నప్పటికీ ఓటు వేయాల్సిందే. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకొని ఓటు వేయడం ముఖ్యం. అయితే అమావాస్య కలిసి వచ్చేది ఎవరికో అనే చర్చ సాగుతోంది.