చిట్టీల పేరుతో మోసం: టీవీ నటి విజయరాణి ఆస్తుల జప్తు
హైదరాబాద్: చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిన టీవీ నటి విజయ రాణి ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అటాచ్ చేసింది. ఆస్తులను జప్తు చేస్తూ హోంశాఖ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిసులను మోసం చేసిన టీవీ నటి విజయరాణిని హైదరాబాద్ నగర నేరపరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు నిరుడు ఏప్రిల్లో అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
చిట్టీల పేరుతో విజయరాణి 4 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు పోలీసాఫీసర్ పాలరాజు అప్పట్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మీడియా సమావేశంలో విజయరాణి ఏడ్చేశారు. తాను ఎవరినీ మోసం చేయలేదని విజయరాణి మీడియా ప్రతినిధులతో అన్నారు. కోటి రూపాయల వరకు తనకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని, తాను ఇవ్వాల్సిన డబ్బులు కూడా అంతే ఉంటాయని ఆమె చెప్పారు. అసలుకు నాలుగింతలు వడ్డీ చెల్లించానని ఆమె చెప్పారు.
అస్తులు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని, లేకుంటే చంపేస్తామని బెదిరించారని, దానివల్లనే తాను పారిపోయానని ఆమె చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులను మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బుల వివరాలను, తాను చెల్లించాల్సిన డబ్బుల వివరాలను తాను పోలీసులకు ఇచ్చినట్లు విజయరాణి తెలిపారు.
తన వద్ద తినడానికి కూడా డబ్బులు లేవని, తన వద్ద డబ్బులు లేకపోతే పోలీసులే తిండి పెట్టారని ఆమె చెప్పారు. విజయరాణి అధిక వడ్డీలు ఆశచూపి నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఆమె 3 నుంచి 20 శాతం వరకు కూడా వడ్డీలు చెల్లించి అప్పులు తీసుకుందని, అధిక వడ్డీలు తీసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
విజయరాణికి చెందిన హైదరాబాదు, గుడివాడల్లోని ఆస్తులను, ఓ కారును, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయరాణితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టయినవారిలో ఆమె చెల్లెలు, కుమారుడు, కోడలు కూడా ఉన్నట్లు చెప్పారు. విజయరాణి బంధువులను కూడా ప్రశ్నించినట్లు తెలిపారు.