అంబేడ్కర్ తత్వం తెలంగాణకు ఆదర్శం : కేటీఆర్.. రాజ్యాంగ నిర్మాతకు నేతల నివాళి
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 128వ జయంతి వేడుకలు రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాలు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాగ్రామాన అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. పలుచోట్ల పార్టీలకు అతీతంగా నేతలు అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కూడా ఘనంగా నివాళి ప్రకటించారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ విజి గౌడ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు తదితరులు నివాళి అర్పించారు.
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. రాణిగంజ్లోని అడవయ్య క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు.
అంబేడ్కర్ అడుగుజాడల్లో..!
తెలంగాణ భవన్ లో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పలువురు మంత్రులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అంబేడ్కర్ విధానాలతోనే దళితులకు చట్టసభల్లో అవకాశం దక్కుతోందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అంబేడ్కర్ అడుగుజాడల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పేదల హక్కుల కోసం అంబేడ్కర్ కృషి చేశారని, దేశవ్యాప్తంగా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ ఖర్చు పెడుతోందన్నారు.
అంబేడ్కర్ చలువతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ భవన్ లో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ చూపిన మార్గమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆదర్శమని.. అదే నేపథ్యంలో ఉద్యమం నడిపారని అన్నారు. అంబేడ్కర్ అనుసరించిన తత్వం నేటి భారతావనికి చాలా అవసరమన్నారు. అంబేడ్కర్ కు నిజమైన నివాళి అర్పించడమంటే.. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడటమేనని వ్యాఖ్యానించారు.
భద్రాద్రి రాములోరికి పట్టువస్త్రాలు.. భక్తజనులకు ముత్యాల తలంబ్రాలు
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిస్తాం..!
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం చేరువ చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాల కొనసాగింపునకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ క్రమంలోనే దళితుల పిల్లలకు విదేశీ విద్య, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రత్యేక గురుకులాలు, దళితులకు 3 ఎకరాల భూమి తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అంబేడ్కర్ 128వ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. పాతబస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.