రూ. 4 లక్షలతో తమ్ముడి పట్టివేత: ఉడాయించిన లేడీ తాహిస్ల్దార్
హైదరాబాద్: ఓ వ్యక్తి నుంచి తొలి విడతగా రూ. 4 లక్షలు తీసుకుంటూ తమ్ముడు నాగేశ్వర రావు గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో హైదరాబాదులోని అంబర్పేట మహిళా తాహిసల్దార్ సంధ్యా రాణి పరారయ్యారు. రూ. 9 లక్షలు ఇవ్వాలంటూ ఓ భవన యజమానిని లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ చివరకు రూ.4 లక్షలకు బేరం కుదుర్చుకొని ఆ డబ్బులను తీసుకోవడానికి తన తమ్ముడిని పంపించి ఏసీబీ అధికారులకు చిక్కింది.
మలక్పేట అక్బర్బాగ్కు చెందిన మహ్మద్ అత్తార్ అహ్మద్ వృతి రీత్యా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు. అక్బర్బాగ్లోని 525 గజాల్లో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నాడు. నెల రోజుల క్రితం అంబర్పేట తహసీల్దార్ ఎస్.సంధ్య అతను నిర్మిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ప్రభుత్వ మిగులు భూమిలో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నావని బెదిరించింది. తాను ఆ స్థలాన్ని కొనుగోలు చేసి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నానని అత్తార్ అహ్మద్ వివరించాడు.
అయినా తహసీల్దార్ వినలేదు. అది ప్రభుత్వ భూమి అని, నోటీసులు జారీ చేస్తే నిర్మాణం ఆగిపోతుందని పనులు నిలిపి వేసింది. అత్తార్ అహ్మద్ నెలరోజులుగా అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. చివరకు తనకు రూ 9 లక్షలు ఇస్తే అనుమతిస్తానని సంధ్య బేరసారాలకు దిగింది. చివరకు అతను రూ. 4 లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు.
అంతకుముందు ఈ నెల 9న అత్తార్ అహ్మద్ ఈ విషయమై ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అతడి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు మహ్మద్ అత్తార్కు రూ. 4 లక్షలు ఇచ్చి ఆమెకు ఇవ్వాలని సూచించారు. దీంతో అతడు డబ్బులు తీసుకొని ఆమెకు ఫోన్ చేశాడు. గురువారం డబ్బులు ఇస్తానని చెప్పాడు. అయితే, తాను ఓ వ్యక్తిని పంపిస్తానని, అతడికి డబ్బులు ఇవ్వాలని ఆమె చెప్పింది.
అతను పంజాగుట్ట వద్దకు వస్తాడని అక్కడే డబ్బులు ఇవ్వాలని సూచించింది. మధ్యాహ్నం డబ్బులు తీసుకొని అత్తార్ అహ్మద్ పంజాగుట్టకు వెళ్లాడు. అతడి వెంటే ఏసీబీ అధికారులు వెళ్లారు. మ. 2.30 సమయంలో తహసీల్దార్ సోదరుడు వెంకట నాగేశ్వర్రావు వచ్చాడు. డబ్బుల కోసం అతడికి ఫోన్ చేశాడు. అత్తార్ అతడి వద్దకు వెళ్లి రూ. 4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వి.రవికుమార్, ఇన్స్పెక్టర్లు అంజిరెడ్డి, ఆజాద్, నిరంజన్, మంజుల, మాజీద్ అలీఖాన్ రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు.
లంచం తీసుకోవడానికి వెళ్లిన తమ్ముడు నాగేశ్వర్రావుకు తహసీల్దార్ సంధ్య పలు జాగ్రత్తలు సూచించింది. డబ్బులు తీసుకునేటప్పుడు ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్ ధరించాలని, పేరు చెప్పొద్దని, తహసీల్దార్కు గల రిలేషన్(సంబంధం) కూడా చెప్పొద్దని అతడి సెల్ఫోన్కు మెసేజ్ చేసింది.
వెంకటనాగేశ్వర్రావును అధికారులు పంజాగుట్ట నుంచి తీసుకుని ఆమె అంబర్పేట మండల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న అబిడ్స్లోని జీహెచ్ఎంసీ సర్కిల్-9బీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే తమ్ముడికి నాలుగైదుసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన తహసీల్దార్ పని ఉందని ఉడాయించింది. నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించారు. అలాగే, అంబర్పేట మండల కార్యాలయంలో, సఫిల్గూడలోని ఆమె నివాసంలో సోదాలు చేశారు.