రూ.4 లక్షలతో ఏసీబీకి దొరికిన తమ్ముడు: లొంగిపోయిన కిలాడీ సంధ్య
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) పట్టుబడకుండా పరారైన అంబర్ పేట తహసీల్దారు సంధ్యారాణి సోమవారం ఉదయం ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోయారు. ఆమెకు కోర్టు రిమాండ్ విధించాక, పోలీసులు జైలుకు తరలిస్తారు. నాలుగు రోజుల క్రితం రూ.4 లక్షలు లంచం తీసుకున్న కేసులో సంధ్య నిందితురాలు.
ఓ వ్యక్తి నుంచి తొలి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటూ తమ్ముడు నాగేశ్వర రావు గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో హైదరాబాదులోని అంబర్పేట మహిళా తాహిసల్దార్ సంధ్యా రాణి పరారైన విషయం తెలిసిందే.
రూ.9 లక్షలు ఇవ్వాలంటూ ఓ భవన యజమానిని లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ చివరకు రూ.7 లక్షలకు బేరం కుదుర్చుకుంది. తొలి విడతగా రూ.4 లక్షలను తీసుకోవడానికి తన తమ్ముడిని పంపించి ఏసీబీ అధికారులకు చిక్కింది.
మలక్పేట అక్బర్బాగ్కు చెందిన మహ్మద్ అత్తార్ అహ్మద్ వృతి రీత్యా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు. అక్బర్బాగ్లోని 525 గజాల్లో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నాడు. నెల రోజుల క్రితం అంబర్పేట తహసీల్దార్ సంధ్యా రాణి అతను నిర్మిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ప్రభుత్వ మిగులు భూమిలో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నావని బెదిరించింది. అపార్టుమెంట్ నిర్మాణం కోసం అతని వద్ద రూ.7 లక్షలు తీసుకునేందుకు సిద్ధపడింది.