తెలంగాణలో పెట్టుబడులకు 'ఏఎండీ'ని ఒప్పించిన కేటీఆర్.. (పిక్చర్స్)
అమెరికా : అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్రానికి సంబంధించి పలు రంగాల్లో పెట్టుబడుల కోసం ఆయా కంపెనీల ప్రతినిథులతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా యూఎస్ చిప్ మేకర్ ఏఏండీ కంపెనీతో చర్చలు జరిపిన కేటీఆర్, రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీని ఒప్పించారు.
దీంతో భవిష్యత్తులో ఏంఎండీ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామిగా మారే అవకాశముంది. కాలీఫోర్నియాలోని సన్నీవేల్ లో ఉన్న ఏఎండీ హెడ్ క్వార్టర్స్ లో కంపెనీ అధికార ప్రతినిథులతో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్.
ఏఎండీ కంపెనీ చీఫ్ మార్క్ పేపర్ మాస్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రూథ్ కాటర్ తో చర్చలు జరిపిన కేటీఆర్ రాష్ట్రంలోను ఏఎండీ తమ సంస్థను నెలకొల్పాలని కోరగా, సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిథులు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టగా సమాచారం.
గ్రాఫిక్స్, గేమింగ్, మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో సేవలను అందించనున్న ఏఎండీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఆనిమేటింగ్ సిటీలో భాగస్వామ్యం కానున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో సంస్థకు సంబంధించిన ఇనిస్టిట్యూట్ లను కూడా నెలకొల్పాలని కోరిన కేటీఆర్ ట్రిపుల్ ఐటీ, ఐఐటీ తరహాలో శిక్షణ అందించే సంస్థలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కంపెనీ ప్రతినిధుల ముందుంచారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తే.. ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి, పలు సౌకర్యాల గురించి మంత్రి కేటీఆర్ కంపెనీ యాజమాన్యానికి వివరించారు. ఇకపోతే దీనిపై స్పందించిన ఏఎండీ ప్రతినిథులు.. తమ కంపెనీ ఇటీవలే రూపొందించిన చిప్ జెన్ కూడా హైదరాబాద్ లోను రూపుదిద్దుకుందని తెలిపారు. భవిష్యత్తులోను హైదరాబాద్ కేంద్రంగా సంస్థ నుంచి మరిన్ని సరికొత్త ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో విశేషమేంటంటే.. తాజాగా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రతిష్టాత్మక తెలుగు చిత్రం బాహుబలికి కూడా ఇదే సంస్థ గ్రాఫిక్స్ డిజైన్స్ చేయడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ప్రతినిథులే వెల్లడించగా, భవిష్యత్తులోను తెలుగు మరియు ఇతర భాషల్లో తమ సేవలను విస్తరిస్తామని చెప్పుకొచ్చారు.
ఇక అంతకుముందు కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెరీ బ్రౌన్ తో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. భేటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ టీఎస్ఐపాస్ గురించి, కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ గురించి వివరించారు కేటీఆర్.
అలాగే, శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న మరో ప్రతిష్టాత్మక కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రతినిథులతోను భేటీ అయిన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న పలు రాయితీల గురించి, సౌకర్యాల గురించి కంపెనీ సేల్స్ ఫోర్స్ టీమ్ హెడ్ శ్రీనివాస్ తల్లాప్రగడకు వివరించారు.
పర్యటనలో భాగంగా ఐటీ దిగ్గజం లింకెడిన్ కంపెనీ సహా వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రీడ్ హాఫ్ మాన్ తోను భేటీ అయ్యారు. దేశంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను విస్తరించే విషయాలపై ఆరా తీసిన ఆయన, రాష్ట్రంలోను పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు.
అమెరికాలో పర్యటనలో భాగంగా ఏఎండీ కంపెనీ చీఫ్ మార్క్ పేపర్ మాస్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రూథ్ కాటర్ తో పాటు కంపెనీ అధికార ప్రతినిథులతో భేటీ అయ్యారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.
ఏఎండీ కంపెనీ ప్రతినిథులతో చర్చల్లో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ గురించి కంపెనీ ప్రతినిథులకు వివరించిన కేటీర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.