ఆర్నెళ్లలో విచారణ: రోశయ్యకు మళ్లీ అమీర్పేట భూముల చిక్కు, ఏం జరిగింది?
సమైక్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు మళ్లీ అమీర్ పేట భూముల చిక్కు వచ్చి పడింది.
హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు మళ్లీ అమీర్ పేట భూముల చిక్కు వచ్చి పడింది. ఈ అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
ఆరు నెలల్లో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు
హైదరాబాదులోని మైత్రివనంలో 9.5 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య డీనోటిఫై చేశారని ఆరోపిస్తూ మోహన్ అనే వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆరు నెలల్లో విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
గతంలో నోటీసులు ఇచ్చినా, గవర్నర్ కాబట్టి
గతంలో ఆయన తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడే విచారణ కోసం ఏసీబీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తులకు ఇమ్యూనిటీ ఉంటుందని గతంలో న్యాయవాదులు వాదించడంతో, కేసు నిలుపుదల చేసింది. ఆరోపణలు తీవ్రమైనవిగా సుప్రీం వ్యాఖ్యానించింది.
రోశయ్యపై ఇదీ కేసు
2009-10 మధ్యలో రోశయ్యమీద భూవివాదం కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసుకు సంబంధించి అప్పట్లో ఏసీబీ క్లీన్ చీట్ ఇచ్చింది. తర్వాత తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ రోశయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రోశయ్యకు ఊరట కలిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టుకు కూడా నోటీసులు జారీ చేసే అధికారం లేదని
రోశయ్య వ్యక్తిగత హాజరుపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. రోశయ్య రాజ్యాంగబద్దమైన వ్యక్తి అని, ఆయన గవర్నర్గా ఉన్నంత వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయవద్దని ఆదేశించింది. అప్పట్లో అమీర్పేట భూముల కేసులో రోశయ్య ఆగస్టు 2న వ్యక్తిగతంగా కాకుండా తన న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చుకోవచ్చునని తెలిపింది. రోశయ్య రాజ్యాంగ బద్దమైన వ్యక్తి కాబట్టి నోటీసులు జారీ చేసే అధికారం కోర్టుకు కూడా లేదని ఈ సందర్భంగా తెలిపింది.
ప్రధాని, రాష్ట్రపతి వరకు
మరోవైపు, అమీర్ పేట భూముల కేసులో రోశయ్యకు ఎసిబి కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. రోశయ్యను విచారించకుండానే ఎసిబి నివేదికను కోర్టుకు సమర్పించింది. అమీర్పేట భూవ్యవహారంలో ఐఎఎస్ అధికారులు సమర్పించిన పత్రాలను, ఇతర సాక్ష్యాలను జోడిస్తూ తెలంగాణ న్యాయవాదుల సంఘం నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు గతంలో ఫిర్యాదు చేసింది. రోశయ్యను రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఆయన కొద్ది నెలల క్రితం వరకు తమిళనాడు సీఎంగా ఉన్నారు.