తెలుగు విద్యార్థులపై అమెరికా అధికారుల తీవ్రవ్యాఖ్య, 9గంటలపాటు కావ్యకి సిల్లీ ప్రశ్నలు!
హైదరాబాద్: అమెరికాకు వెళ్లిన పలువురు విద్యార్థులను అక్కడి ఇటీవల ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. తమను ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధించారని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ డాగ్స్ అని కూడా అమెరికా అధికారులు వ్యాఖ్యానించారట.
వరంగల్కు చెందిన సందీప్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్, గుంటూరు జిల్లాకు చెందిన కరుణాకర్లు ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతుల్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తమను అధికారులు తనిఖీల పేరుతో బాగా ఇబ్బంది పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తనిఖీల పేరుతో గంటల తరబడి నిర్బంధించి, అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా ఆ విశ్వవిద్యాలయాలు (నార్త్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ వర్సిటీ) బ్లాక్ లిస్టులో ఉన్నాయని తిరిగి వెళ్లిపోవాలని సూచించారన్నారు. ఎందుకని ప్రశ్నిస్తే తుపాకీ గురి పెట్టి బెదిరించారని వాపోయారు. తిండిపెట్టకుండా గదిలో బంధించినట్లుగా కూడా చెప్పారు.
ఇదిలా ఉండగా, స్టడీ కోసం వెళ్లిన కావ్య అనే అమ్మాయిని ఇమిగ్రేషన్ అధికారిణి తొమ్మిది గంటల పాటు కూర్చోబెట్టి, పలు సిల్లీ ప్రశ్నలతో విసిగించి, ఆపై అన్ని కాగితాలూ బాగున్నాయని చెప్పి మరీ వెనక్కు పంపించారట.
కావ్య తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ టీవీ చానల్తో పంచుకుంది. గత ఏడాది డిసెంబర్ నెల 22న హైదరాబాద్ నుంచి దుబాయ్ అక్కడి నుంచి సియాటెల్ వెళ్లానని, తన పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సియాటెల్లో ఉందని, విమానం దిగగానే ప్రైమరీ ఇన్స్పెక్షన్ దగ్గర, వారు తనను ఏ యూనివర్శిటీకి వెళ్తున్నావని అడిగారని, ఎన్పీయూ కాలిఫోర్నియా వర్శిటీకి వెళ్తున్నానని చెప్పానని కావ్య తెలిపారు.
తనకు రెడ్ కార్డు ఇచ్చి చివరగా ఉన్న గదిలోకి వెళ్లమన్నారు. గదిలో ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ సమయంలో.. ఓ అధికారి తనను ప్రశ్నలతో వేధించారని చెప్పారు.
'మీ నాన్న డేటాఫ్ బర్త్ ఏంటి? ఎక్కడ పుట్టారు? ఇక్కడ ఏ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావు? వంటి సంబంధం లేని సిల్లీ ప్రశ్నలతో తొమ్మిది గంటలు విచారించారట. అన్ని సర్టిఫికేట్లు బాగున్నాయని, అధికారిణి వచ్చి సంతకం పెడతారని చెప్పారని, ఆ తర్వాత వెళ్లి పోవాలని చెప్పారని తెలిపింది.