పడమటి సంధ్యారాగంలా.: అమెరికా అబ్బాయితో తెలంగాణ అమ్మాయి పెళ్లి
నిజామాబాద్: దేశాలు, భాషలు, సంస్కృతులు వేరైనప్పటికీ ఆ ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలిశాయి. ఇంకేముంది ఆ ఇద్దరు వారి కుటుంబాలను ఒప్పించారు... మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు వారికి ఆశీర్వాదాలు అందజేశారు. వారే అమెరికాకు చెందిన అబ్బాయి, తెలంగాణకు చెందిన అమ్మాయి.
ఉన్నతచదువుల కోసం అమెరికాకు అర్చన..
వివరాల్లోకి వెళితే.. నాందేవాడకు చెందిన సోమేశ్వర్, వరలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె అర్చన 2010లో ఎమ్మెస్సీ చేసేందుకు అమెరికా వెళ్లింది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన అర్చన అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడింది. 2014లో ఆమెకు గ్రీన్ కార్డు కూడా లభించింది.
శాన్విన్డ్యాగ్తో అర్చన పరిచయం ప్రేమగా..
ఈ క్రమంలో 2019 జనవరిలో స్థానిక ఆన్లైన్ మాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా అమెరికాలోని మిచిగాన్ నగరానికి చెందిన శాన్విన్డ్యాగ్తో అర్చనకు పరిచయం ఏర్పడింది. అతడు యానిమేషన్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. కాగా, వీరిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.
Recommended Video
పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో..
ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారు కూడా అంగీకరించడంతో 2019 మే 15న అర్చన, శాన్విన్డ్యాగ్ అమెరికాలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత గురువారం(మార్చి 12న) నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు కట్టుబాట్లతో పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 15న ఈ దంపతులు తిరిగి అమెరికాకు వెళ్లనున్నారు.