మళ్లీ మావోయిస్టుల అలజడి - ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ కీలక పర్యటన - గణపతి లొంగుబాటు వేళ..
ఆసిఫాబాద్ అడవుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి చోటుచేసుకోవడం.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్.. ఇటీవల తన దళంతో కలిసి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరించాడని పోలీసులు ప్రకటించడం.. అంతలోనే మావోయిస్టు అగ్రనేతలు గణపతి, వేణుగోపాల్ లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు రావడం.. లాంటి కీలక పరిణామాల నడుమ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పర్యటించడం సంచలనంగా మారింది. గడిచిన నెల రోజులుగా జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి..
మావోయిస్టు పార్టీలో మరో సంచలనం - గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు? - తెలంగాణ సేఫ్!
డీజీపీ ఏరియల్ సర్వే..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహకంలోని ఏజెన్సీ ప్రాంతాలనూ ఆయన పరిశీలించారు. అంతకుముందు, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు చేరుకున్న పోలీస్ బాస్ కు ఆసిఫాబాద్ కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, రామగుండం సీపీ సత్యనారాయణ స్వాగతం పలికారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీకి రావడం ఇది రెండోసారి. కాగా..
పేర్ల వెల్లడిపై స్థానికుల లొల్లి..
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్, స్థానిక కేడర్తో కలిసి తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే జూలై 15న మంగి ఆడవుల్లో పోలీసులకు, మావో యిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయని, మావోయిస్టులు జారవిడుచుకున్న వస్తువుల్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటిలో మావోయస్టులకు సహకరిస్తోన్న వ్యక్తుల సమాచారం ఉందంటూ సంబంధిత వివరాలను జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ శనివారం(ఆగస్టు 30న) మీడియాకు తెలిపారు. కాగా, దర్యాప్తునకు ముందే పేర్లను బయటికి ప్రకటించడంపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఎస్పీ చెప్పిన జాబితా ఇదే..
భాస్కర్ దళంతో ఎదురుకాల్పుల సమయంలో లభించిన డైరీలోని వివరాలను బట్టి మత్తడిగూడ గ్రామానికి చెందిన సిడాం జంగదేవ్, సల్గుపల్లికి చెందిన సోయం చిన్నయ్య, రోంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్, చాల్బడికి చెందిన గోవింద్రావు, పార్వతిగూడకు చెందిన హన్మం తురావు, చోర్పల్లికి చెందిన జగ్గరావు తదితరులతో పాటు తుడుందెబ్బకు చెందిన మహేష్, డీటీఎఫ్కు చెందిన రమేష్, ఆదివాసీ విద్యార్థి సంఘానికి చెందిన వివేక్, దీపక్ తదితరులకు మావోయిస్టు నాయకుడు భాస్కర్తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిందని ఇన్చార్జి ఎస్పీ వారియర్ మీడియాకు చెప్పారు. ఎదురు కాల్పుల ఘటన సమయంలో ఒక సారి, అనుమానితుల పేర్లు వెల్లడైన సందర్భంలో రెండోసారి రాష్ట్ర డీజీపీ ఆసిఫాబాద్ అడవుల్లో పర్యటించడం గమనార్హం. ఆయన పర్యటన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?